Anti CAA rally: బీజేపీ కార్యకర్తలే ముసుగులు ధరించి విధ్వంసం చేస్తారన్న మమతా బెనర్జీ
పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య రాష్ట్రం అయిన వెస్ట్ బెంగాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు మిన్నంటుతున్నాయి. పౌరసత్వం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళనలకు పిలుపునిచ్చారు.
శుక్రవారం ప్రార్ధనల సందర్భంగా బీజేపీ కుట్రలు చేసే అవకాశం ఉందన్న మమతా బెనర్జీ
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు అయిన తర్వాత ఇప్పుడు భారతీయ పౌరులుగా నిరూపించుకోవాలా అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. సీఏఏను కేంద్రం ఉపసంహరించుకునేంత వరకు నిరసనలు ఆపవద్దని పశ్చిమబెంగాల్ సీఎం సూచించారు.నేడు శుక్రవారం, ప్రార్ధనల సందర్భంగా బీజేపీ మత ఘర్షణలు రగిల్చే ప్రయత్నం చేసే అవకాశం ఉందని జాగ్రత్త అని మమత సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఏఏపై బీజేపీ ప్రభుత్వానికి మమతా బెనర్జీ సవాల్
దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీ మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. ఓ వర్గం మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా కొందరు బీజేపీ కార్యకర్తలు ముసుగులు ధరించి విధ్వంసానికి పాల్పడుతున్నారని తనకు సమాచారం వుందని మమతా బెనర్జీ ఆరోపించారు.
కోల్కతాలో మమతా బెనర్జీ భారీ ర్యాలీ... బీజేపీపై ఫైర్
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కోల్కతాలో మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడారు. ‘మెజారిటీ ఉంది కదా అని బీజేపీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీజేపీకి దమ్ముంటే ఐక్యరాజ్యసమితి సమక్షంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ మీద రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు . ఐక్యరాజ్య సమితి కాకపోతే మానవహక్కుల కమిషన్తో నిష్పాక్షికంగా ఆ రెఫరెండం నిర్వహించాలని ఆమె సవాల్ విసిరారు .
దమ్ముంటే ఐ.రా.స పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యాలని డిమాండ్
బీజేపీకి దమ్ముంటే పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ)లపై ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సవాలు విసిరారు. ఈ ఓటింగ్లో కనుక బీజేపీ ఓటమిపాలైతే గద్దె దిగిపోవాలని మమతా బెనర్జీ సవాల్ చేశారు.ఎవరూ బీజేపీ ట్రాప్ లో పడొద్దని ఆమె పేర్కొన్నారు. నేడు పార్క్ సర్కస్లో నిరసన చేపడుతున్నామని, ప్రజలు అందరూ సంయమనంతో వ్యవహరించాలని మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. దీన్ని హిందు - ముస్లింల మధ్య ఘర్షణగా మార్చాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది .
పశ్చిమ బెంగాల్ లో చల్లారని మంటలు .. నేడు పార్క్ సర్కస్లో నిరసన
మొన్నటికి మొన్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్లో ఆందోళనకారులు ఐదు ఖాళీ రైళ్లకు నిప్పు పెట్టారు. బస్సులను దగ్ధం చేశారు .ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అట్టుడుకుతూనే ఉన్నాయి.మమతా బెనర్జీ మాత్రం సీఏఏ అమలు పశ్చిమ బెంగాల్ లో జరిగే సవాలే లేదని తేల్చి చెప్తున్నారు. నేడు పార్క్ సర్కస్లో నిరసన తెలపనున్నారు.