సీఏఏ ఘర్షణలు: మేఘాలయాలో పది మందికి కత్తిపోట్లు, 2కు పెరిగిన మృతుల సంఖ్య, రంగంలోకి కేంద్ర బలగాలు
షిల్లాంగ్: ఇప్పటికే దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరగగా.. తాజాగా మేఘాలయా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా మేఘాలయా రాజధాని షిల్లాంగ్లో భారీ ఎత్తున ఆందోళనకారులు విధ్వంసానికి దిగుతున్నారు.
షిల్లాంగ్లోని జైయావ్, లాంగ్సింగ్, సోహ్రా(చిరపుంజి) ప్రాంతాల్లో చోటు చేసుుకన్న అల్లర్లలో పది మంది కత్తిపోట్ల కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని ఇచమటి ప్రాంతంలో ఓ స్థానిక టాక్సీ డ్రైవర్ను దుండగులు హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్(కేఎస్యూ), నాన్ ట్రైబల్స్ మధ్య ఘర్షణలు మొదలయ్యాయి.
షిల్లాంగ్లోని ఘర్షణల ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇప్పటిక రెండు కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి. మరో ఆరు ఆర్మీ కంపెనీలు చేరుకుంటున్నాయి. అతి ప్రాచీనమైన మార్కెట్ బారా బజార్ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో కత్తి పోట్లకు గురైన అస్సాంలోని బర్పేట జిల్లాకు చెందిన రూప్చంద్ దివాన్(29) చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
లాగ్సింగ్లో 21ఏళ్ల ఆకాశ్ అలీపై దాడి జరిగిందని, మరో నాన్ ట్రైబల్ వ్యక్తిపైనా దాడి జరిగిందని.. వారిద్దరూ ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అల్లర్లలో గాయపడిన వారి సంఖ్య 16కు చేరుకుందని పోలీసు అధికారులు వెల్లడించారు. రూప్ చంద్ దివాన్ తోపాటు లుర్షాయి హైన్నీట(35) అనే వ్యక్తి కూడా హత్యకు గురయ్యాడు. సీఏఏపై చర్చించిన కేఎస్యూ.. ఇన్నర్ లైన్ పర్మిట్(ఐఎల్పీ)ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది.
కాగా, అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలిక నిలిపివేశారు. అల్లర్లకు కారణమైన 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రజలంతా హింసకుదూరంగా ఉండాలని మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రడ్ కే సంగ్మా పిలుపునిచ్చారు. శాంతి భద్రతలకు సంబంధించిన అన్ని చర్యలు ప్రభుత్వం చేపడుతుందని హామీ ఇచ్చారు. అల్లర్లలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు.