Anti CAA WAR:యూపీ భవన్ వద్ద ఉద్రిక్తత ..అదుపులో విద్యార్థులు ...ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపధ్యంలో అటు రాజధాని ఢిల్లీ లోనూ , యూపీలో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో యూపీలో మృతుల సంఖ్య 16కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 23 కు చేరింది. గత ఐదు రోజుల నుంచి యూపీలో జరుగుతూనే ఉన్న ఆందోళనలను అదుపులోకి తీసుకురావటానికి పోలీసులు తీవ్రయత్నం చేస్తున్నా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్రంలో పౌరసత్వసవరణ చట్టంపై వ్యతిరేకత సందర్భంగా జరుగుతున్న ఆందోళనల నేపధ్యంలో పోలీసుల చర్యను నిరసిస్తూ కొంతమంది విద్యార్థులను దక్షిణ ఢిల్లీలోని యూపీ భవన్ వెలుపల ఆందోళనకు దిగారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇక మరోవైపు జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి.
యుపిలో హింసాకాండ కారణంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. లక్నో, కాన్పూర్, అలహాబాద్, ఆగ్రా, ఘజియాబాద్, వారణాసి, మధుర, మీరట్, మొరాదాబాద్, ముజఫర్ నగర్, బరేలి, ఫిరోజాబాద్, పిలిభిత్, రాంపూర్, సహారాన్పూర్, షామ్లీ, సంబ్లితో సహా అజమ్గర్ మరియు సుల్తాన్పూర్ లలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. అలీఘర్ జిల్లాలో ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించబడ్డాయి. అక్కడ డిసెంబర్ 15న ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేశారు