Citizenship Bill:అట్టుడుకుతున్న ఈ శాన్య రాష్ట్రాలు, రోడ్లపైకి, 2 నెలల చిన్నారి మృతి
గౌహతి: లోక్సభలో సోమవారం ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి సంఘాలు, లెఫ్ట్ డెమోక్రాటిక్ ఆర్గనైజేషన్స్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చాయి. భారీ ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి రావడంతో ఓ రెండు నెలల చిన్నారి ఆస్పత్రికి సరైన సమయంలో చేరుకోకపోవడంతో మార్గమధ్యలోనే మృతి చెందింది. పౌరసత్వ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బుధవారం ఈ బిల్లుకు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
ఈ క్రమంలో అస్సాం బ్రహ్మపుత్ర వ్యాలీలో ఆల్ అస్సాం విద్యార్థి సంఘాలు, నార్త్ ఇస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్(ఎన్ఈఎస్ఓ)కు చెందిన యువకులు భారీ ఎత్తున రోడ్లపైకి చేరుకుని నిరసనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో బంద్ నిర్వహించారు. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది.
పలు వామపక్ష సంస్థలైన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఏ లాంటి సంస్థలు వేర్వేరుగా బంద్కు పిలుపునిచ్చాయి. గౌహతిలోని వివిధ ప్రాంతాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం సీఎం సర్బనాంద సోనోవాల్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.
ఆందోళనల నేపథ్యంలో అస్సాం సచివాలయం, అసెంబ్లీ భవనాల వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. దిబ్రూగర్లో సీఐఎస్ఎఫ్ పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. దులియజన్లోని ఆయిల్ ఇండియా లిమిటెడ్లో చొరబడేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్గగించారు. పోలీసులు లాఠీ ఛార్జీ చేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆందోళన నేపథ్యంలో సీఎం సోనోవాల్, మంత్రులు తాము వెళ్లే మార్గాలను మార్చుకున్నారు.
ఆందోళనకారులు పట్టాలపై నిరసనకు దిగడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. బీజేపీ, ఏజీపీ, దూరదర్శన్ కేంద్రాల వద్ద నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. మంత్రి హిమాంత బిశ్వకర్మ భార్యకు చెందిన టీవీ ఛానల్ ఆఫీసు ముందు కూడా నిరసన చేపట్టారు.
Assam: Protest being held in Guwahati against #CitizenshipAmendmentBill2019. Home Minister Amit Shah to table the Bill in Rajya Sabha today. pic.twitter.com/jCa0aI4wx4
— ANI (@ANI) December 11, 2019
ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో సీఎం సోనోవాల్ మాట్లాడుతూ.. తప్పుడు సమాచారంతో రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించవద్దని కోరారు. యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నవారిపై మండిపడ్డారు. హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెంగాళీలు ఎక్కువగా ఉండే బరాక్ వ్యాలీలో నిరసనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఏఏఎస్యూ నేతలు చెప్పారు.
త్రిపురలో కూడా నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. 48గంటలపాటు త్రిపురలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. బిశ్రంగంజ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి రావడంతో ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళుతున్న ఓ రెండు నెలల చిన్నారి నిరసనల కారణంగా సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేకపోయింది. మార్గమధ్యలోనే ఆ చిన్నారి ప్రాణాలు వదిలింది. త్రిపురలోని పలు ప్రాంతాలు, అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. మణిపూర్, మేఘాలయాలో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. పలు వాహనాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. దీంతో పోలీసులు భారీ ఎత్తున చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.