మోడీకి వ్యతిరేకంగా ఫేస్బుక్లో కవిత: బిజెపి మీడియా ఇంఛార్జ్పై వేటు
ఆగ్రా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తూ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా శాఖ భారతీయ జనతా పార్టీ మీడియా ఇంఛార్జ్ రాసిన ఓ కవిత మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ కవితకు చాలా మంది లైకులు కూడా కొట్టారు. అయితే అందులో ఎక్కువమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, కొంతమంది హిందూ సంస్థలకు చెందిన నేతలే ఉన్నారు.
కాగా, మోడీని విమర్శిస్తూ కవిత రాసిన ఆగ్రా శాఖ బిజెపి మీడియా ఇంఛార్జ్ రాజ్కుమార్ పాఠిక్ను బిజెపి నాయకత్వం సస్పెండ్ చేసింది. కాశ్మీర్లో పిడిపికి మద్దతు ఇవ్వడం ద్వారా పాముకి పాలు పోసి పెంచుతున్నారని, తొందర్లేనే ఈ పాము మోడీని కాటేసే అవకాశాలున్నాయని ఆ కవితలో పాఠిక్ ఘాటుగానే స్పందించారు.
ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కారణంగా పాఠిక్ను సస్పెండ్ చేసినట్లు పార్టీ నగర అధ్యక్షుడు నాగేంద్ర దూబే గామా తెలిపారు. పాఠిక్ వ్యాఖ్యలపై విచారణ చేపడుతున్నట్లు చెప్పారు.
తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని పాఠిక్ సమర్థించుకుంటున్నారు. తానేమీ తప్పుగా మాట్లాడలేదని, స్వయంగా మోడీయే పిడిపి-బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడారని చెప్పుకొచ్చారు. అంతేగాక, ఇది తన ఒక్కడి వాదన కాదని, వేర్పాటువాద పార్టీతో కలవడం దేశ వ్యాప్తంగా విమర్శలకు తావిస్తోందని తెలిపారు.