దేశద్రోహులు తినాల్సింది బుల్లెట్లే.. బిర్యానీలు కాదు.. అనురాగ్ ఠాకూర్కు సీటీ రవి సమర్థన..
''పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తున్నవాళ్లంతా దేశద్రోహులే.. వాళ్లపట్ల కనికరం అవసరమేలేదు. నిలబెట్టి నిలువునా కాల్చిపారేయండి.. తుపాకి తూటాలతో తూట్లుపొడిచేయండి..'' అంటూ సీఏఏ అనుకూల ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు సొంతపార్టీలో మద్దతు పెరుగుతోంది. కర్నాటక మంత్రి సీటీ రవి ఏకంగా ట్విటర్ లోనే దీనిపై ఇంకా సంచలనరీతిలో స్పందించారు.
రెచ్చగొట్టడమే..
తాను వివాదాస్పద నినాదాలు చేయడమేకాక.. మీటింగ్ కు హాజరైన జనం చేతా.. ‘దేశ్ కే గద్దారోంకో.. గోలీమారో సాలోంకో..‘‘ నినాదాలు చేయించిన కేంద్ర మంత్రి వీడియో రెండ్రోజులుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. షాహీన్ బాగ్ నిరసనకారుల్ని ఉద్దేశించి ఆయనీ కామెంట్లు చేశారు. ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, బడ్జెట్ కు ముందు వారం ఆర్థిక శాఖ సహాయమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపాయి. ఒక కేంద్రమంత్రి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమేంటని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నవేళ ఠాకూర్ను బీజేపీ నేతలు బాసటగా నిలుస్తున్నారు.
చంపుడే కరెక్ట్
దేశద్రోహులను కాల్చిపారేయాలన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తానని, ఆయనన్నదాంట్లో తప్పేమీ లేదని కర్నాటక మంత్రి సీటీ రవి చెప్పారు. అనురాగ్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన నేపథ్యంలో మంత్రి రవి స్పందించారు. ‘‘నిజమేకదా, దేశద్రోహుల్ని బుల్లెట్లతో కాల్చిపారేయాలేగానీ బిర్యానీలు తినిపిస్తామా? అనురాగ్ అన్నదాంట్లో తప్పేముంది?''అని ప్రశ్నించారు.
ద్రోహుల్లో రకాలు..
అనురాగ్ ఠాకూర్ చేసిన కామెంట్లను విమర్శిస్తున్నాళ్లు కూడా దేశద్రోహులే అవుతారని కర్నాటక మంత్రి రవి చెప్పారు. అజ్మల్ కసబ్, యాకుబ్ మెమన్ ఉరితీతను వ్యతిరేకించేవాళ్లు.. తుక్డే తుక్డే గ్యాంగును సమర్థించేవాళ్లు.. సీఏఏపై అసత్యాలు ప్రచారం చేసేవాళ్లకు మాత్రమే ఠాకూర్ వ్యాఖ్యలు తప్పనిపిస్తాయని రవి చెప్పారు. ఆదివారం అమిత్ షా నాయకత్వంలో ఢిల్లీలో జరిగిన ర్యాలీలోనూ ఈ తరహా నినాదలు వినిపించినట్లు తెలుస్తోంది.
ఫిర్యాదు అందలేదన్న ఈసీ
కేంద్ర మంత్రి వివాదాస్ప వ్యాఖ్యల వీడియోలు, వార్తలు ఇంటర్నెట్, మీడియాను షేక్ చేస్తున్నా.. దీనికిపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని ఢిల్లీ ఎన్నికల అధికారులు చెప్పడం గమనార్హం. అయితే దీన్ని పట్టదగిన నేరంగానే గుర్చించి, నార్త్ వెస్ట్ ఢిల్లీలో ఠాకూర్ పాల్గొన్న సభకు సంబంధించిన వీడియోలు పరిశీలిస్తామని తెలిపారు. ఈసీ ప్రకటనపై కాంగ్రెస్, ఆప్ మరోసారి మండిపడ్డాయి. బీజేపీ నేతలు ఇంత తీవ్రవ్యాఖ్యలు చేసినా యాక్షన్ తీసుకోకపోవడాన్ని తప్పుపట్టాయి.