ఇకపై వ్యక్తులనూ ఉగ్రవాదులుగా గుర్తించొచ్చు.. యూఏపీఏ బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్..
ఢిల్లీ : మోడీ సర్కారు మరో కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయించుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ సవరణ బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై చర్చ అనంతరం జరిగిన ఓటింగ్లో 147 మంది అనుకూలంగా 42 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఉగ్రవాదానికి మతం లేదని మానవాళికకి ఉగ్రవాదులు వ్యతిరేకమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో చెప్పారు. యూఏపీఏ సవరణ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్ వీగిపోయింది. ఈ ప్రతిపాదనకు 104 మంది సభ్యులు వ్యతిరేకంగా, 85మంది అనుకూలంగా ఓటు వేశారు.
వ్యక్తులను ఉగ్రవాదిగా ప్రకటించే అవకాశం
సవరణ బిల్లుపై చర్చ ప్రారంభించిన హోం మంత్రి ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా తేల్చేందుకు నాలుగు స్థాయిల విచారణ తర్వాతే ప్రకటన చేస్తారని హోం మంత్రి స్పష్టం చేశారు. ఒక ఉగ్రసంస్థను నిషేధిస్తే, దాంట్లో పనిచేసిన వ్యక్తి మరో ఉగ్రసంస్థను ప్రారంభిస్తారని, అందుకే వ్యక్తిని ఉగ్రవాదిగా వెంటనే ప్రకటించాలని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం సమస్యగా మారిందని, అమెరికా, చైనా, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఈయూ, యూఎన్లు కూడా వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తున్నాయని చెప్పారు.
అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. నాలుగు రోజుల్లో మొదలు పెడతాం..
బిల్లుపై కాంగ్రెస్ అభ్యంతరం
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సవరణ బిల్లుపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మామూలు వ్యక్తులను సైతం ఉగ్రవాదులుగా ప్రభుత్వం ముద్రవేసేందుకు బిల్లు వీలు కల్పించడం సరికాదని అన్నారు. ఈ సవరణ వల్ల ఎన్ఐఏకు అధికారాలు పెరుగుతాయని అంటూనే మరోవైపు వ్యక్తులను ఉగ్రవాదులుగా గుర్తించడం లేదా తొలగించే హక్కు కేంద్రానికి ఉందని చెప్పడంపై కాంగ్రెస్ నేత చిదంబరం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ భిన్న ధోరణుల వల్లే సవరణను వ్యతిరేకిస్తున్నామే తప్ప యూపీఏపీకి తాము వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్దం
యూపీఏపీ చట్ట సవరణ వల్ల ఎన్ఐఏ ఏ రాష్ట్రంలోనైనా ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం లభిస్తుంది. ఇది సమాఖ్య స్పూర్తికి విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని దుర్వినియోగం చేయమని ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ హామీ ఇవ్వాలని బహుజన్ సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేసింది. ఉగ్రవాది ఎప్పటికీ ఉగ్రవాదేనని, చిన్న చిన్న సవరణలకు తాము వ్యతిరేకంకాదని అన్నారు.
కాంగ్రెస్ తీరుపై అమిత్ షా అభ్యంతరం
ప్రతిపక్షాల అభ్యంతరాలపై హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మోడీ సర్కారు కొత్త చట్టం తేవడంలేదని గతంలో ఉన్న దానికే సవరణలు చేస్తున్న విషయాన్ని సభ్యులు గమనించాలని కోరారు. ఇది ఉగ్రవాదుల అణిచివేత విషయంలో తమ ప్రభుత్వం మరో ముందడుగు మాత్రమే వేస్తోందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సవరణలు చేసిన కాంగ్రెస్ ప్రతిపక్షంగా మారగానే వైఖరి మార్చుకోవడం సరికాదని అమిత్ షా హితవు పలికారు.