నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు వివాదాస్పదం, ప్రస్తావించిన ఇమ్రాన్ ఖాన్: అనుపమ్ ఖేర్ దిమ్మతిరిగే షాక్
న్యూఢిల్లీ: బులంద్షహర్ హింసాత్మక ఘటనపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ ఒక్కరికీ స్వేచ్ఛ లేదని, మతం విషయంలో తన పిల్లల గురించి భయంగా ఉందని నసీరుద్దిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మతం, గోసంరక్షణ పేరుతో మూకదాడులు పెరిగాయని, మనుషుల ప్రాణాల కన్నా జంతువుల ప్రాణాలే ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించారు.
నసీరుద్దీన్ షా వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నసీరుద్దిన్ షాకు ఇంకా ఎంత స్వేచ్ఛ కావాలని, సైన్యాన్ని నోటికొచ్చినట్లు తిట్టేంత, వారిపై రాళ్ల దాడి చేసేంత స్వేచ్ఛ మన దేశంలో ఉందని, ఇంకా ఎంత స్వేచ్ఛ కావాలని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నసీరుద్దిన్ ఏదో అనేసినంత మాత్రాన అవి నిజాలు అయిపోవని చెప్పారు.
గతంలో మాటల యుద్ధం
సర్జికల్ స్ట్రయిక్స్పై కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ వాటిలో నిజం ఎంత అని ఎయిర్ ఫోర్స్ చీఫ్పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అబద్ధాలకోరు అని వ్యాఖ్యానించడంపై అనుపమ్ ఖేర్ ఇలాగే మండిపడ్డారు. ఇదివరకు కూడా అనుపమ్, నసీరుద్దిన్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాశ్మీరీ పండితుల విషయంలో వీరిద్దరి మధ్య గతంలో మాటల యుద్ధం జరిగింది.
ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు
భారత ప్రజల్లో సహనం అనే డీఎన్ఏ ఉన్నందున నసీరుద్దీన్ షా తన పిల్లల కోసం భయపడనవసరం లేదని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ కూడా కౌంటర్ ఇచ్చారు. ఆయన భావోద్వేగాలు సరైనవే కావచ్చు కానీ ఆయన మాటలు అపార్థాలకు దారితీశాయన్నారు. గోరంతలు కొండంతలు అవుతున్నాయని చెప్పారు. భారత్ సహనశీల దేశం. సహనం, సామరస్యం ఈ దేశ డీఎన్ఏలోనే ఉన్నాయన్నారు. ఆ వారసత్వ ధ్వంసానికి ప్రయత్నించిన వారందరూ విఫలమయ్యారని, నసీరుద్దీన్షా తన పిల్లల కోసం భయపడాల్సిన అవసరం లేదని, రాజ్యాంగం ఆధారంగా ఈ దేశం ముందుకు పోతోందని, ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
పాకిస్తాన్ వెళ్లేందుకు నసీరుద్దీన్ షాకు విమాన టిక్కెట్లు బుక్
పాకిస్థాన్ వెళ్లేందుకు నసీరుద్దీన్ షాకు ఓ విమాన టికెట్ పంపుతామని యూపీ నవ నిర్మాణ సేన తెలిపింది. నసీరుద్దీన్ షాకు భారత్లో భయమేస్తుంటే ఆయన పాకిస్థాన్ వెళ్లిపోవచ్చునని, ఆయన ఆగస్ట్ 14న పాకిస్థాన్ వెళ్లేందుకు ఒక విమాన టికెట్ను బుక్ చేశామని సేన అధ్యక్షులు అమిత్ జానీ చెప్పారు. ఆయనలా ఇంకా ఎవరైనా భయపడుతుంటే వారందరికీ టికెట్లు బుక్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
దేశభక్తునిగా స్పందించానంటూ
వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నసీరుద్దీన్ షా స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని, తనను దేశద్రోహిగా ఎందుకు చిత్రిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎవరికైనా తనను విమర్శించే హక్కు ఉంటే, ఆ హక్కు తనకు కూడా ఉంటుందన్నారు.
నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు, భారత్కు ఇమ్రాన్ ఖాన్ సుద్దులు
నసీరుద్దీన్ షా వ్యాఖ్యలపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందించారు. మైనార్టీల పట్ల ఎలా వ్యవహరించాలో తాము నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నేర్పిస్తామని, మైనార్టీలకు దక్కాల్సిన హక్కులను కల్పించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పాకిస్థాన్ వ్యవస్థాపకులు మహమ్మద్ అలీ జిన్నా కన్న కల కూడా అదేనని, నూతన పాకిస్థాన్లో మైనార్టీలు తాము సురక్షితమనే వాతావరణంతోపాటు వారికి సమాన హక్కులు కల్పిస్తామని, మైనార్టీల పట్ల ఎలా వ్యవహరించాలో మోడీ సర్కార్కు చూపిస్తామని, భారత్లో మైనార్టీలకు తోటి పౌరులుగా చూడటం లేదని స్వయంగా భారతీయులే చెప్తున్నారంటూ... నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలను ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు.
నసీరుద్దీన్ షా కౌంటర్
తాను చేసిన వ్యాఖ్యలపై పొరుగు దేశం పాకిస్తాన్ ప్రధాని స్పందించడంపై నసీరుద్దీన్ షా మళ్లీ స్పందించారు. ఆయనకు (ఇమ్రాన్ ఖాన్) సంబంధం లేని అంశాలు పక్కన పెట్టి, తన దేశం (పాకిస్తాన్) గురించి ఆలోచించాలని కౌంటర్ ఇచ్చారు. కాగా, ఒక వార్తా సంస్థకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో నషీరుద్దీన్ షా మాట్లాడుతూ... ఓ పోలీసు హత్య కావడం కన్నా ఓ ఆవు మరణానికే ఈ దేశంలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, యూపీలోని బులంద్షహర్లో ఈ నెల 3న ఆవు కళేబరాలు కనిపించాయన్న నెపంతో దళ్ నేత నేతృత్వంలోని అల్లరిమూకలు పాల్పడిన హింసలో ఓ సీఐ హతకు గురయ్యారన్నారని, ఇప్పటికే విస్తరించిన విషాన్ని అదుపు చేయడం, ఆ భూతాన్ని మళ్లీ సీసాలో దించడం చాలా కష్టమని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే వారికి శిక్ష పడటం లేదని, తన పిల్లల పరిస్థితి చూస్తే భయమేస్తోందని, ఎప్పుడైనా ఓ మూక వారిని చుట్టుముట్టి మీరు హిందువులా? ముస్లింలా? అని ప్రశ్నిస్తే వారి వద్ద జవాబు లభించదని, ఈ పరిస్థితులు ఇప్పట్లో మారేలా కనిపించడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.