ఇండియన్ ఆర్మీపై ఓంపురి సంచలన వ్యాఖ్యలు, విమర్శలు
ముంబై: భారత సైన్యాన్ని అవమానించినందుకు నటుడు ఓం పురి పైన మరో నటుడు అనుపమ్ ఖేర్ మంగళవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఆర్మీ పైన ఓంపురి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కాగా, ఇండియన్ ఆర్మీ పైన ఓంపురి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యూరి ఘటన నేపథ్యంలో ఓ జాతీయ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చలో ఓంపురి మాట్లాడాడు. భారత్లోని పాక్ నటులకు మద్దతుగా సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను మీరు సమర్ధిస్తున్నారా? అని అడగగా.. మీరు భారత్, పాక్లను శతాబ్దాలుగా కొట్టుకున్న ఇజ్రాయిల్- పాలస్తీనాలా చూడాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
ఇది దేశాలు విడిపోయే విషయం కాదు.. కుటుంబాలు విడిపోయే విషయమన్నారు. మన దేశంలో 22 కోట్ల ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం రెండో స్థానంలో ఉందని, ఇప్పటికీ నేను పాకిస్తాన్ నటులతో కలిసి పని చేస్తానన్నారు.
అదే సమయంలో బారాముల్లా, యూరి దాడుల్లో చనిపోయిన సైనికుల గురించి ప్రస్తావించగా.. వారిని సైన్యంలో చేరమని మనం బలవంతం చేశామా, ఎవరు ఆర్మీలో చేరి ఆయుధాలు పట్టుకోమన్నారని షాకింగ్ సమాధానం ఇచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.