అప్పుడు గోలీమార్..ఇప్పుడు గబ్బర్ - కిరాతక ఆర్జేడీ గెలిస్తే బీహార్లో రక్తపాతమే:కేంద్ర మంత్రి అనురాగ్
''పడుకోండి పిల్లలూ.. లేకుంటే గబ్బర్ సింగ్ ఎత్తుకెళ్లిపోతాడు.. 'షోలే' సినిమాలోని ఈ డైలాగ్ ను బీహార్ లోని ప్రతి తల్లి గుర్తుచేయాలిప్పుడు. 15ఏళ్ల కిందట ఆర్జేడీ హయాంలో జంగల్ రాజ్(ఆటవిక పాలన)ను చవి చూసిన తల్లులు.. ఓటేయడానికి వెళ్లే ముందు తమ బిడ్డలకు జాగ్రత్తలు చెప్పాలి. ఆర్జేడీ గెలిస్తే బీహార్ లో మళ్లీ అరాచకవాదం పెరిగిపోతుందన్న విషయాన్ని వివరించాలి'' అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
అడ్డంగా దొరికిన విజయసాయిరెడ్డి - మోదీ-జగన్ మధ్య ఉల్కాపాతం -పోలవరం అసలు కథ: ఎంపీ రఘురామ
మళ్లీ కుల ఘర్షణలు..
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘గోలీమారో సాలోంకో..' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి అనురాగ్.. తాజాగా బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష ఆర్జేడీని ‘షోలే' విలన్ ‘గబ్బర్ సింగ్'తో పోల్చారు. సోమవారం బీహార్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. పొరపాటున ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ కుల ఘర్షణలు, సామాజిక వివక్ష పెరిగిపోతాయని, కాబట్టి తల్లులంతా గబ్బర్ ను గుర్తు చేసుకుని తమ పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలని మంత్రి వ్యాఖ్యానించారు.
తుక్డే తుక్డే గ్యాంగులతో పొత్తేంటి?
ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహా కూటమి కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతోందని, దేశాన్ని ముక్కలు చేయాలనుకునే తుక్డే తుక్డే గ్యాంగులతో, లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో తేజస్వీ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. దేశ వ్యతిరేకులతో కలిసి పనిచేస్తోన్న తేజస్వీ.. బీహార్ లో మళ్లీ రక్తపాతం సృష్టించాలనుకుంటున్నారా? జంగల్ రాజ్ ను పున:స్థాపించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ప్రస్తుత బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనీ కామెంట్లు చేశారు. అంతేకాదు..
Recommended Video
లాలూ లేకుండా తేజస్వీని నమ్మరు..
దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ సుప్రీం లీడర్ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం రాంచీ జైలులో ఉన్నందున బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంలేదు. అయితే ఆర్జేడీ ర్యాలీల్లోగానీ, పోస్టర్లు, ప్రకటనల్లోగానీ లాలూ ఫొటో, పేరు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ప్రస్తావిస్తూ.. లాలూ ఫొటో లేకుండా తేజస్వీ యాదవ్ ను జనం నమ్మబోరని, కన్నతండ్రి ఫొటోకు విలువ ఇవ్వని తేజస్వీని మహాకూటమి సీఎం అభ్యర్థిగా ఎలా ఎంచుకుందో అర్థంకావట్లేదని మంత్రి ఎద్దేవా చేశారు. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీకి బుధవారం(28న) తొలి దశ పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో రెండో, మూడో దశ పోలింగ్ తో ఎన్నికలు ముగుస్తాయి. అదే నెల 10న ఫలితాలు వెలువడతాయి.
ప్రవీణ్ ప్రకాశ్ పని పట్టాల్సింది జగనే -చెప్పు దెబ్బలు -షాకింగ్ సర్వే చూశారా?: ఎంపీ రఘురామ