మా పెళ్లి అయ్యేనా?: భారత అబ్బాయి-పాక్ అమ్మాయి ఆందోళన!
జైపూర్: ఇప్పటి వరకు భారత్, పాకిస్థాన్ సరిహద్దు గ్రామాల మధ్య కొంత సుహృద్భావ, ప్రశాంత వాతావరణం ఉండేది. అయితే, ఇటీవల పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన యూరీ దాడితో ఆ వాతావరణం లేకుండా పోయింది. యూరీ దాడిలో 20మంది భారత సైనికులను ఉగ్రవాదులు బలితీసుకున్న విషయం తెలిసిందే.
కాగా, ఆ తర్వాత భారత్.. సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడి జరిపింది. ఈ దాడుల్లో 40మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ ఇప్పటికే ఐదారుసార్లు కాల్పులకు తెగబడింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని సుమారు వెయ్యి గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు.
అయితే, తాజా పరిణామాలు మాత్రం ఓ జంటకు తెగ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే.. పాకిస్థాన్ అమ్మాయికి, భారతదేశంలోని ఓ అబ్బాయికి ఇప్పటికే నిశ్చితార్థం జరిగిపోయింది. ఎంచక్కా పెళ్లికి సిద్ధమైన పోయిన ఆ జంటకు ఈ దాడులు వారి మధ్య కొంత ఎడబాటును తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో తమ పెళ్లి ఆందోళన చెందుతోంది ఆ జంట.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన నరేష్ తెక్వానికి, పాకిస్థాన్లోని సింధు ప్రావిన్స్కు చెందిన ప్రియా బచానీకి కొద్దిరోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. నవంబర్ 8న పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే యూరీ, సర్జికల్ దాడులు జరగడం వల్ల రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొరవడ్డాయి. ఈ ప్రభావం ప్రియ వీసాపై కూడా పడింది.
పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చేందుకు ప్రియాతో పాటు 15 మంది కుటుంబ సభ్యులు మూడు నెలల క్రితం వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు. పెళ్లి తేదీ సమీపిస్తుండటంతో కరాచీలో నివాసముంటున్న ప్రియా కుటుంబసభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, వరుడి ఇంట్లో మాత్రం పెళ్లికి సంబంధించి 80శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ, ప్రియాకు వీసా రాకపోవడంతో పెళ్లిపై నరేష్కు కూడా దిగులు పట్టుకుంది. అయితే త్వరలోనే ప్రియా కుటుంబసభ్యులకు వీసా వచ్చి ఈ జంట ఒక్కటి కావాలని ఆశిద్దాం.