Disha Murder case: దేశానికే దిశా నిర్దేశం: బెంగళూరులో అత్యుత్తమ టెక్నాలజీ: ఆపదలో ఉన్న 7 సెకెన్లలో.
బెంగళూరు: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు కామాంధులకు బలైన వెటర్నరి డాక్టర్ దిశా హత్యోదంతం అనంతరం కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కోటి మందికి పైగా జనాభా ఉన్న బెంగళూరు నగరంలో మహిళలకు రక్షణ కల్పించడానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. దిశా హత్యోదంతం తరువాత.. అలాంటి దారుణ ఉదంతాలు బెంగళూరులో చోటు చేసుకోకుండా ఉండేలా తక్షణ చర్యలకు దిగింది.
దేశం నలుమూలల నుంచీ..
సిలికాన్ సిటీగా బెంగళూరుకు పేరున్న విషయం తెలిసిందే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోందీ నగరం. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు లక్షలాదిమంది బెంగళూరులో స్థిరపడ్డారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు సహా వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఈ ఉద్యాన నగరిలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి భవన నిర్మాణ రంగంలో స్థిరపడిన వారి సంఖ్యా ఎక్కువే. విధులను ముగించుకుని అర్ధరాత్రి పూట ఇంటికి చేరుకునే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంఖ్య వేలల్లో ఉంటోంది.
కట్టుదిట్టంగా రక్షణ చర్యలు..
ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాదీ వెటర్నరి డాక్టర్ దిశా తరహా ఉదంతాలు చోటు చేసుకోకుండా ఉండటానికి బెంగళూరు పోలీసులు చర్యలు చేపట్టారు. మహిళలకు రక్షణ కల్పించడంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. తాము ఆపదలో ఉన్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారాన్ని చేరవేసిన వెంటనే బాధితురాలిని ఆదుకునే దిశగా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు.
ఏడు సెకెన్లలో ఫోన్ కాల్.. ఆ వెంటనే పోలీసులు..
తాము ఆపదలో ఉన్నట్లు ఎవరైనా ఫోన్ చేసిన ఏడు సెకెన్ల వ్యవధిలో వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వెళ్లేలా బెంగళూరు నగర పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడు సెకెన్ల వ్యవధిలో బాధితురాలికి పోలీసుల నుంచి ఫోన్ కాల్ వెళ్తుందని, జీపీఎస్ ద్వారా ఆమె ఎక్కడ ఉందో పసిగట్టి, క్షణాల వ్యవధిలో సంఘటనాస్థలానికి చేరుకునేలా చర్యలను తీసుకుంటున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావు వెల్లడించారు.
దిశా ఘటన తరువాతే..
హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశా హత్యోదంతం తమను తీవ్రంగా కలచి వేసిందని భాస్కర్ రావు చెప్పారు. అలాంటి ఉదంతాలు బెంగళూరు నగరం పరిధిలో ఎక్కడా చోటు చేసుకోకుండా ఉండటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్ల మహిళలకు వందశాతం భద్రత కల్పిస్తామని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని చెప్పారు. ఏడు సెకెన్లలో బాధితురాలికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వెళ్తుందని, ఆ వెంటనే పోలీసులు కూడా సంఘటనాస్థలానికి చేరుకుంటారని అన్నారు.