ఒక్క స్లిప్ తేడా వచ్చినా..వందశాతం లెక్కించాల్సిందే: ఈసీని కలిసిన విపక్షాలు
Recommended Video
న్యూఢిల్లీ: మరి కొన్ని గంటలు! దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆరంభం కాబోతున్న నేపథ్యంలో.. 21 ప్రతిపక్షాల నాయకులు పట్టువదలని విక్రమార్కుల్లాగా మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై సందేహాలు లేవనెత్తాయి. భారతీయ జనతాపార్టీ ఈ సారి కూడా అధికారంలోకి రాబోతోందంటూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపర్ చేయడం వల్లే ఇది సాధ్యపడిందని ఆరోపించాయి. తమకు న్యాయం చేయాలని మొర పెట్టుకున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా 21 ప్రతిపక్ష పార్టీలు మంగళవారం మధ్యాహ్నం దేశ రాజధానిలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో భేటీ అయ్యాయి. కాంగ్రెస్ తరఫున గులాం నబీ ఆజాద్, అబిషేక్ మను సింఘ్వీ, అశోక్ గెహ్లాట్, సమాజ్వాది పార్టీ నుంచి రామ్గోపాల్ యాదవ్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ, డీఎంకే నాయకురాలు కణిమోళి తదితరులు హాజరయ్యారు.
కాన్స్టిట్యూషనల్ క్లబ్లో సమావేశం ముగిసిన తరువాత వేర్వేరు వాహనాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారు చర్చించారు. అనంతరం వినతిపత్రాన్ని అందజేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి- ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాండమ్గా ఎంపిక చేసిన అయిదు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నుంచి వెలువడిన వీవీప్యాట్ స్లిప్పులను అన్నింటి కంటే ముందుగా లెక్కించాలని కోరారు. ఈ డిమాండ్నే తాము ప్రధానంగా వినిపించారు. ఈ డిమాండ్ పట్ల సునీల్ అరోరా స్పందిస్తూ- తాము విజ్ఞప్తులన్నింటినీ స్వాగతిస్తున్నామని చెప్పారు. బుధవారం ఉదయం తాము మరోసారి భేటీ నిర్వహించిన అనంతరం- ఈ డిమాండ్పై స్పందిస్తామని అన్నారు.
సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు నాయుడు, గులాంనబీ ఆజాద్, అభిషేక్ మను సింఘ్వీ విలేకరులతో మాట్లాడారు. సునీల్ అరోరాతో జరిగిన చర్చల సారాంశాన్ని వివరించారు. సుప్రీంకోర్టు సూచించిన విధంగా అయిదు ఈవీఎంలు, వీవీప్యాట్లను తొలుతగా లెక్కించడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చిన ఇబ్బందేమిటని చంద్రబాబు అన్నారు.
తాము నిరంతరాయంగా పోరాడుతున్నామని చెప్పారు. తాము మరోసారి సమావేశం కాబోతున్నామని, ఈ భేటీ అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. ఒక్క కలుషిత రక్తపు బొట్టు వల్ల శరీరం మొత్తం క్యాన్సర్ కు గురయ్యే ప్రమాదం ఉందని విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క స్లిప్ తేడా వచ్చినా, నియోజకవర్గం పరిధిలోని అన్ని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేశారు. దీనిపై తాము చాలాకాలంగా పోరాడుతున్నామని గుర్తు చేశారు.