మెజార్టీ ఉంటే గవర్నర్ను కలవండి, పార్టీలకు అమిత్ షా పిలుపు, రాష్ట్రపతి పాలన విధించిన మరునాడే..
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించి ఒక్కరోజు పూర్తయిందో లేదో కేంద్రం స్పందించింది. రాష్ట్రంలో ప్రతిష్టంభన తొలగించుకోవాలనే పార్టీలు తగిన మెజార్టీతో గవర్నర్ను కలువాలని కోరాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కావాల్సిన మెజార్టీ సభ్యుల మద్దతు పత్రాలతో గవర్నర్ భగత్సింగ్ కోషియారిని కలువాలని అమిత్ షా కోరారు.
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనే శరణ్యమా..? శివసేనకు గవర్నర్ మరో ఛాన్స్ ఇస్తారా...?
అంగీకరించి.. మాట మార్చి...
మహారాష్ట్రలో కూటమిపై శివసేన మాట మార్చిందని అమిత్ షా దుయ్యబట్టారు. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అభ్యర్థి అని అంగీకరించారని తెలిపారు. ఆ తర్వాతే మాట మార్చారని విమర్శించారు. శివసేన కొత్త డిమాండ్లు అంగీకారం కాదని తేల్చిచెప్పారు. ఎన్నికలకు ముందు పలు వేదికల్లో ఫడ్నవీస్ సీఎం అని మోడీ, తాను చెప్పినట్టు గుర్తుచేశారు. కానీ శివసేన తమకు సీఎం పదవీ ఇవ్వాలని కోరడం సరికాదంటున్నారు.
సీఎం సీటు..
మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. బీజేపీ-శివసేన కూటమి సీఎం సీటు చిచ్చురేపింది. 50-50 ఫార్ములాకు కమలనాథులు సుముఖత వ్యక్తం చేయడంతో కూటమి నుంచి శివసేన బయటకొచ్చింది. తర్వాత ఎన్సీపీకి స్నేహహస్తం అందించింది. అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతుపై నాన్చివేత అవలంభించడంతో సమయం ముగిసిపోయింది. ఈ లోపు గవర్నర్ ఎన్సీపీకి సమయం ఇవ్వడం.. మధ్యలో శివసేన మిన్నకుండిపోవడంతో రాష్ట్రపతి పాలనకు దారితీసింది.
ప్రతిష్టంభనపై...
సాధారణంగా రాష్ట్రపతి పాలన కనీసం 6 నెలలు అమల్లో ఉంటుంది. ఈ లోపు పార్టీలు తగిన మెజార్టీతో గవర్నర్ను కలిసి మద్దతు గురించి తెలుపవచ్చు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి పాలన విధించగా.. కాసేపటి క్రితం హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీలు గవర్నర్ను కలువాలని కోరారు. రాష్ట్రపతి పాలన విధించిన ఒక్కరోజులోనే హోంమంత్రి స్పందించడం విశేషం.
40 అడుగుల దూరంలో
105 స్థానాలతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అధికారం చేపట్టేందుకు 40 సీట్ల దూరంలో నిలిచిపోయింది. తమ భాగస్వామ్య పక్షం శివసేన సపోర్ట్ చేస్తామని.. కానీ తమకు రెండున్నరేళ్లు సీఎం పదవీ కావాలని షరతు పెట్టడంతో వారి పొత్తు పొడవలేదు. దీంతో శివసేన కూడా తమ వైరి పక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీతో కూడా చేతులు కలిపేందుకు సిద్ధమైంది. ఉద్దవ్ థాకరే.. ఆ పార్టీ నేతలతో వరసగా సమావేశాలు నిర్వహించారు.
ఉద్దవ్ బిజీ బిజీ..
ఉద్దవ్ థాకరే బుధవారం వరసగా కాంగ్రెస్, ఎన్సీపీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఇటు బీజేపీ కూడా పరిస్థితిని నిశీతంగా గమనిస్తోంది. తమ పాత మిత్రుడు శివసేనను దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. సేన తమతో చేయి కలిపితే.. మహారాష్ట్రలో కమలం వికసించడం నల్లేరు మీద నడకే. ఇందుకోసం అమిత్ షా ఏ వ్యుహాలను అమలు చేస్తాడోననే ఉత్కంఠ కూడా నెలకొంది.