అయోధ్యలో రాములోరికి పూజల్లేవ్..పునస్కారాల్లేవ్: 26 ఏళ్లుగా దీపారాధన ఒక్కటే!
లక్నో: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడికి గుడి కట్టని గ్రామం ఈ దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు. సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రస్వామి వారిని పూజించని హిందువూ ఉండరు. సాక్షాత్తూ ఆ శ్రీరాముడు జన్మించినట్టు భావిస్తోన్న స్థలంలో ఆయన పూజలు, పునస్కారాలకు నోచుకోలేకపోతున్నారు. నిత్య పూజలు, కైంకర్యాలతో అలరారాల్సిన శ్రీరామమందిరం భూ వివాదం కారణంగా బోసి పోయింది. 26 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అక్కడ నెలకొంది. దీనికి ప్రధాన కారణం- సుప్రీంకోర్టు ఆదేశాలు. ఎలాంటి మతపరమైన కార్యకలాపాలను వివాదాస్పద స్థలంలో నిర్వహించకూడదంటూ సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలను విధించింది.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలానికి సంబందించిన వివాదాలు పరిష్కృతమయ్యేంత వరకూ సదరు ప్రదేశంలో ఎలాంటి పూజలను నిర్వహించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. 1993 జనవరి 7వ తేదీన ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అప్పటి నుంచీ ఈ నాటి వరకూ రాములోరి విగ్రహానికి పూజలు నిర్వహించకూడదంటూ ఆదేశించింది. సాయంత్రం పూట దీపారాధన చేయడానికి ఒక్క ఆలయ ప్రధాన అర్చకుడికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఆయన వెంట రెండో వ్యక్తి ఉండకూడదని సూచించింది. ఈ 26 ఏళ్ల కాలంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలవుతూనే వస్తున్నాయి.
సాధారణ రోజుల్లోనే కాదు..పండగల వంటి ప్రత్యేక సందర్భాల్లో కూడా అయోధ్యలోని శ్రీరాముల గుడిలో గంటలు మోగవు. హారతులు ఉండవు. దీపాలను మాత్రమే వెలిగిస్తారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన రామమందిరంలో దీపోత్సవాన్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రామ మందిరంలో రోజువారీ పూజలను చేయడానికి ప్రధాన అర్చకుడికి మాత్రమే అనుమతి ఉందని, ప్రత్యేక పూజలు, వేడుకలను నిర్వహించడాన్ని ప్రత్యేకాధికారి సుప్రీంకోర్టు నిషేధించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 144 సెక్షన్ ను సైతం విధించడం, పండుగలను కూడా దాని పరిధిలోకి తీసుకుని వచ్చామని తెలిపారు.
బిగ్ ట్విస్ట్: అయోధ్య కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు కేసు ఉపసంహరణ? సీబీఐ దర్యాప్తు కారణమా?
దశాబ్దాల తరబడి న్యాయస్థానాల్లో నానుతూ వస్తోన్న అత్యంత సున్నితమైన, కోట్లాదిమంది హిందువులు, ముస్లిం సోదరుల మనోభావాలతో ముడిపడి ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించిన విచారణ తుది దశకు చేరుకుంది. అయోధ్యలో 2.72 ఎకరాల స్థలం ఎవరికి చెందాలనే విషయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం మరి కొన్ని గంటల్లో తన తుది విచారణను చేపట్టబోతోంది. బుధవారం చేపట్టే విచారణతో చివరిది. ఇకపై ఈ అంశంపై వాదోపవాదాలు ఉండబోవు. ఇక ఏకంగా తీర్పే వెలువడుతుంది. తుది విచారణ ముగిసిన అనంతరం తీర్పును వెలువరించే తేదీ వెలువడే అవకాశం ఉంది.