కర్ణాటక సీఎం కుమారస్వామిని అభినందించిన ఆంధ్ర సీఎం జగన్, రుణమాఫీలు ఎలా చేశారు !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి పని తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్. డి. కుమారస్వామి చెప్పారు. రామనగర జిల్లాలోని చెన్నపట్టణలో జరిగిన బహిరంగ సమావేశంలో సీఎం కుమారస్వామి మాట్లాడారు.
జగన్- కుమారస్వామి
ఢిల్లీలో నీతిఆయోగ్ సమావేశం జరిగింది. ఆ సందర్బంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ను కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్బంలో ఇద్దరు సీఎంలు పలు విషయాలపై చర్చించారు.
సంకీర్ణ ప్రభుత్వం
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం రుణమాఫీల విషయంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ అడిగి తెలుసుకున్నారని కుమారస్వామి గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో తాను, వైఎస్. జగన్ మాట్లాడుకున్నామని సీఎం కుమారస్వామి అన్నారు.
చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ లో గత సీఎం నారా చంద్రబాబు నాయుడు వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని వైఎస్ జగన్ అన్నారని సీఎం కుమారస్వామి చెప్పారు. గత ఐదు సంవత్సరాల పాలనలో చంద్రబాబు నాయుడు ఐదు వేల కోట్ల రుణమాఫీలు చెయ్యలేదని జగన్ తనతో అన్నారని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు.
రూ. 25 వేల కోట్లు
కర్ణాటకలో అమలు చేసిన రూ. 25 వేల కోట్ల రుణమాఫి విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్. జగన్, కర్ణాటక సీఎం కుమారస్వామి చర్చలు జరిపారు. కర్ణాటకలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఈ సందర్బంలో వైఎస్ జగన్ కు వివరించానని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు.
రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని
గతంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కర్ణాటకలో అమలు చేసిన రుణమాఫి విషయంలో తనను అభినందించారని సీఎం కుమారస్వామి గుర్తు చేశారు. నీతిఆయోగ్ సమావేశానికి ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కర్ణాటక సీఎం కుమారస్వామి భేటీ అయ్యి రుణమాఫీ విషయంలో చర్చించారు.