Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా దిశ చట్టం: ఆప్ మేనిఫెస్టోలో పొందుపరిచే ఛాన్స్..?
అమరావతి/న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ దిశ చట్టం అత్యంత కీలకంగా మారబోతోందా? ఎన్నికల్లో తమ విజయావకాశాలను మెరుగుపరచుకోవడానికి రాజకీయ పార్టీలు దీన్ని ఒక సాధనంగా వినియోగించుకునే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దిశ చట్టాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో కమిటీలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం.
మూడు నెలల్లో నోటిఫికేషన్.. ఢిల్లీ ఎన్నికల్లో
వచ్చే రెండు లేదా మూడు నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలని, ఈ సారి కూడా భారతీయ జనతా పార్టీని ప్రతిపక్ష స్థానానికి మాత్రమే పరిమతం చేయడానికి వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా- ఏపీ దిశ చట్టాన్ని అమలు చేస్తామనే హామీని ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. తాము రెండోసారి అధికారంలోకి వస్తే.. దిశ చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇవ్వడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా ఉందని అంటున్నారు.
దేశంలోనే తొలి రాష్ట్రంగా..
మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన కిరాతకులకు మూడువారాల్లోనే ఉరిశిక్షను విధించడానికి న్యాయవ్యవస్థల ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏపీ దిశ చట్టానికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే ఈ చట్టాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ తరహా చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది ఏపీ.
అధ్యయనం చేస్తోన్న ఇతర రాష్ట్రాలు..
దిశ చట్టంపై పలు రాష్ట్రాలు ఆసక్తి చూపాయి. కామాంధులకు 21 రోజుల్లోనే ఉరిశిక్షను అమలు చేయడానికి ఢిల్లీ, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు వైఎస్ జగన్ ను అభినందిస్తూ తమ సందేశాలను పంపించాయి. ఈ చట్టానికి సంబంధించిన ప్రతులను తెప్పించుకున్నాయి. వాటిపై అధ్యయనం చేస్తున్నాయి. తమ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయడానికి గల సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంపించిన అభినందన సందేశాన్ని అసెంబ్లీలో చదివి వినిపించారు స్పీకర్.
ఆప్ ఎన్నికల ప్రచారాస్త్రంగా
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు దిశ చట్టాన్ని అమలు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దిశ చట్టాన్ని అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలా? లేక తాము అధికారంలోకి వస్తే దిశ చట్టాన్ని అమలు చేస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపరచాలా? అనే అంశంపై ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు చర్చిస్తున్నారు. మేనిఫెస్టోలో పొందుపరచడమే మేలనే అభిప్రాయాన్ని మెజారిటీ నాయకులు వెలిబుచ్చుతున్నట్లు తెలుస్తోంది.
మేనిఫెస్టో కమిటీలో విస్తృత చర్చ..
ఏపీ దిశ చట్టాన్ని అమలు చేస్తామనే విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో కమిటీ అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చాలని, దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. దేశ రాజధానిలో అత్యాచారాల రేటు అధికంగా ఉండటం వల్ల.. ఎట్టి పరిస్థితుల్లోనూ దిశ చట్టానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
అత్యాచారాలకు అడ్డుకట్ట వేయడానికి..
అత్యాచారాలకు అడ్డుకట్ట వేయడానికి ఏపీ దిశ చట్టం అత్యద్భుతంగా పనిచేస్తుందనే అభిప్రాయం ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా మహిళలపై నేరాలను నియంత్రించ వచ్చని, ఇదే విషయంపై ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు.