ఇబ్బందుల్లో ఉన్నాం, పక్క రాష్ట్రాలను అడుగుతా: బాబు
బెంగళూరు: తీవ్రస్థాయిలో సాగునీరు, తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర కుడి కాల్వ నుంచి 32 టీఎంసీల నీటిని ఆంధ్రకు అందించాలని రాష్ట్ర సిద్ధరామయ్యను కోరారు.
సోమవారం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సమావేశంలో తుంగభద్ర కుడి కాల్వ ఆధునీకరణకు సంబంధించి అంగీకారం కుదిరింది. అలాగే, తుంగభద్ర నీటిని ఏవిధంగా పంచుకోవాలన్న దానిపైనా వీరిద్దరూ కూలంకషంగా చర్చించారు. సమావేశంలో ఇరు రాష్ట్రాలకూ చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో చంద్రబాబు, సిద్ధరామయ్య మాట్లాడారు. కుడి కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యానికి ఏమాత్రం భంగం కలిగించకుండా తుంగభద్ర ఆధునీకరణ చర్యలు చేపట్టాలని ఉభయ ప్రభుత్వాలూ నిర్ణయించినట్టు వెల్లడించారు. అలాగే నీటి వినియోగవాటా విషయంలో ట్రిబ్యునల్ చేసిన సూచనలకు భంగం కలుగకుండా, సుప్రీం కోర్టులో పెండింగ్లోవున్న అంశాలతో నిమిత్తం లేకుండా ఆధునీకరణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్టు ఇరు రాష్ట్రాల సిఎంలు వెల్లడించారు.
ఇది పూర్తిగా ఎగువస్థాయి కుడి కాల్వ, అలాగే దిగువస్థాయి కాల్వల ఆధునీకరణకు సంబంధించిన అంశమేనని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఆధునీకరణ ప్రణాళికను అమలు చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రతిపాదనను కర్నాటక నీటి పారుదల కార్పొరేషన్ అయినా నిర్వారీ నిగమ పరిశీలిస్తుందని తెలిపారు.
అలాగే, జలవనరుల విభాగానికి చెందిన సాంకేతిక ఉప కమిటీ ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను మదింపు చేస్తుందని, అనంతరం తుంగభద్ర బోర్డుకు నివేదిక ఇస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తుంగభద్ర బోర్డు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సారధ్యంలో పని చేస్తుందన్నారు.
తుంగభద్ర బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన తరువాతే చంద్రబాబు ప్రతిపాదనకు సంబంధించి ముందుకు వెళ్తామని సిద్ధరామయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి కాల్వల ఆధునీకరణ ఎంతో అవసరమన్నారు.
తుంగభద్ర ఆధునీకరణ వల్ల కేవలం కర్నాటకే కాకుండా ఆంధ్రలోని కర్నూలు, అనంతపురం జిల్లాలు కూడా లబ్ది పొందుతాయన్నారు. తుంగభద్ర ఎగువ, దిగువ కాల్వల ఆధునీకరణ పనులు దీర్ఘకాలంగా ఆగిపోయాయని, ఫలితంగా ఏర్పడిన పూడిక వల్ల రిజర్వాయర్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు.
డ్యామ్ దిగువనున్న సుంకేసుల, ఆర్డీఎస్ నీటి పంపిణీపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రెండువైపులా నీటి ప్రవాహం సరైన విధంగా లేదని, 105 కిలోమీటర్ల మేర కర్నాటకలో ప్రవహిస్తే, మిగతా భాగం ఆంధప్రదేశ్లో ప్రవహిస్తుందన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. పోటీతత్వం అనేది ఇష్యూ కాదని, తాము నేర్చుకుంటామన్నారు. ఏపీ కొత్తగా పుట్టిన రాష్ట్రమని, దీనిని అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. తమ రాష్ట్రానికి సహకారం అందించాలని పక్క రాష్ట్రాలను కోరుతున్నానని చంద్రబాబు చెప్పారు.