మీది ఏపీయే.. మాది ఏపీయే : బర్త్డే వేడుకకు పిలిచి.. ఏంబీఏ విద్యార్థినిపై రేప్
బెంగళూరు : పుట్టినరోజు వేడుకలకు మిత్రుడు ఆహ్వానించడంతో అతడి గదికి వెళ్లిన 24 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. తన మిత్రుడి రూమ్మేట్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆ యువతి బెంగళూరులో ఏంబీఏ చదువుతోంది. స్నేహితుడు తన బర్త్డే సెలబ్రేషన్ కు రావాలని పిలవడంతో వారి రూమ్ కు వెళ్లింది. వేడుకల పేరిట ముగ్గురు కలిసి మందు కొట్టారు. అతడి రూమ్మేట్ ఆమెపై రేప్ చేశాడు. శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బర్త్డే వేడుకల్లో రేప్
బెంగళూరులోని హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ ఏరియా సమీపంలోని దొద్దెనకుండి ప్రాంతంలో.. కర్నూలుకు చెందిన ఆదిత్య, గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి రూమ్ లో ఎంబీఏ చదువుతున్న ఆరిఫ్ అనే మరో యువకుడు షేరింగ్ బేసిస్ లో ఉంటున్నాడు. అయితే శనివారం నాడు ఆరిఫ్ బర్త్డే కావడంతో పార్టీ చేసుకుందామనుకున్నారు. ఆ క్రమంలో తన స్నేహితురాలైన ఎంబీఏ విద్యార్థినిని ఆహ్వానించాడు. మిత్రుడి పిలుపుమేరకు వారి రూమ్ కు వచ్చింది ఆ యువతి.
స్నేహితుడని నమ్మి వస్తే.. అతడి రూమ్మేట్..!
ఆరిఫ్ పుట్టినరోజు సందర్భంగా ముగ్గురూ కలిసి మందు కొట్టారు. అనంతరం ఫుడ్ తెస్తానంటూ ఆరిఫ్ బయటకు వెళ్లాడు. ఆ యువతి కాస్తా రెస్ట్ తీసుకుంటానంటూ బెడ్రూమ్ లోకి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఆదిత్య ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ యువతి అతడిని ఎదిరించలేకపోయింది. దీంతో ఆమెపై అత్యాచారం చేశాడు. వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆరిఫ్ బయటనుంచి వచ్చాక జరిగిన విషయం చెప్పింది. అప్పటికే రాత్రి కావడంతో మరునాడు ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
ఫేస్బుక్ పరిచయం
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కటాకటాల్లోకి నెట్టారు. అదంతా జరిగాక తన మిత్రుడు ఆరిఫ్ సూచన మేరకు కేసు విత్ డ్రా చేసుకుంటానని మళ్లీ ఠాణా మెట్లెక్కింది బాధితురాలు. అయితే FIR నమోదు చేయడంతో అది కుదరని తేల్చి చెప్పారు పోలీసులు. చట్ట ప్రకారం బాధితురాలిని మెడికల్ టెస్టుకు పంపిస్తామని స్పష్టం చేశారు.
ఫేస్బుక్ ద్వారా మొదలైన ఈ పరిచయం చివరకు ఇలాంటి పరిస్థితికి దారి తీసింది. ఆ యువతిది కూడా ఆంధ్రప్రదేశ్ కావడంతో.. ఒకటే రాష్ట్రమని తొందరగా దోస్తీ కుదిరినట్లుంది. అయితే పోలీసుల దర్యాప్తులో ఆదిత్య తన తప్పు ఒప్పుకున్నాడు. మద్యం మత్తులో అలా జరిగిందని చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా విచక్షణ కోల్పోయి చేసిన పని.. చివరకు ఊచలు లెక్కించేలా చేసింది.