మూణ్ణెళ్లు... ఉమ్మడిలోనే ఎన్నికలు: కొత్త సిఎంపై షిండే
రాష్ట్రపతి పాలన పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో తమ జోక్యం ఉండదని చెప్పారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీనే నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. ఎన్నికల పైన తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘానిదేనని చెప్పారు.
అధిష్టానం దోషి కాదు
రాష్ట్ర విభజన అంశంలో ప్రతిపక్షాలు పేర్కొంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ దోషి కాదని డొక్క మాణిక్య వర ప్రసాద్ గుంటూరులో అన్నారు. సీమాంధ్రకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. ప్రత్యేక హోదాను పదిహేనేళ్ళకు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు.
కిరణ్ పైన డిఎస్ మండిపాటు
కిరణ్ కుమార్ రెడ్డిపై పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అడ్డుకునేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నం చేశారన్నారు. క్యాంప్ కార్యాలయాన్ని పొలిటికల్ క్యాంప్ కార్యాలయంగా మార్చారని, అయినప్పటికి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను సోనియా తీర్చాలని, ఆమెకు తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలని డిఎస్ అభిప్రాయపడ్డారు. సామరస్యపూరకంగా పరిష్కారమయ్యే అంశాన్ని ఇంత గందరగోళం చేయడానికి కేవలం కిరణ్ కారణమని ఆయన ఆరోపించారు.
తెలంగాణ నేతలంతా విభేదాలు పక్కనపెట్టి పార్టీని బలోపేతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఎవరినీ ముఖ్యమంత్రిని చేసినా తనకు సమ్మతమేనని, కాంగ్రెస్ పార్టీని కాపాడాలనుకుంటున్న సీమాంధ్రనేతలకు హ్యాట్సాప్ అని, సీమాంధ్రలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయోత్సవం జరుపుకునేందుకు ప్రతి ఒక్క తెలంగాణవాదికి హక్కు ఉందని డిఎస్ పేర్కొన్నారు.