అది అపార్ట్మెంటా? బారా?! మంచినీటి కుళాయిలు తిప్పితే మద్యం వరద, షాకైన జనం
తిరువనంతపురం: ఓ అపార్ట్మెంట్లోని కుళాయిలు తిప్పితే మంచినీటికి మద్యం వస్తోంది. అన్ని ఫ్లాట్లలోనూ ఇలాగే జరగడంతో ఆ అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. కేరళలో జరిగిన ఈ ఘటనకు అసలు కారణంగా స్థానిక అబ్కారీ శాఖ చేసిన పొరపాటే కావడం గమనార్హం.
6వేల లీటర్ల మద్యం..
ఆ వివరాల్లోకి వెళితే.. కేరళలోని త్రిస్సుర్ జిల్లాలో ఆరేళ్ల క్రితం సదరు అపార్ట్మెంట్ సమీపంలో ఓ బార్ ఉండేది. అప్పట్లో తనిఖీలు చేసిన స్థానిక అబ్కారీ శాఖ అధికారులు ఆ బార్పై దాడి చేసి భారీ స్థాయిలో అక్రమంగా నిలువ చేసిన మద్యాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి నిల్వ ఉంచిన సుమారు 6వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నీటితో కలిసిపోయిన మద్యం..
ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పట్టుబడిన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయాలని అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఇటీవలే అధికారులు బార్ పక్కనే ఒక గుంత తవ్వి.. ఆ మొత్తం మద్యాన్ని అందులో పారబోశారు. ఇందుకు వారికి దాదాపు 6గంటల సమయం పట్టింది. అయితే, అలా భారీ మొత్తంలో భూమిలో ఇంకిపోయిన మద్యం నేల పొరల్లోని నీటిలో కలిసిపోయింది.
అసలు విషయం తెలిసి..
ఈ నేపథ్యంలో ఆ ప్రదేశంలో నిల్వఉన్న మద్యం స్థానికులు ఉపయోగిస్తున్న నీటి ట్యాంకుల్లోకి చేరింది. అదే నీటిని అపార్ట్మెంట్ వాసులకు సరఫరా చేయడంతో అన్ని ట్యాపుల్లోనూ మద్యం రావడం జరిగింది. దీంతో జనం ఖంగుతిన్నారు. అసలు విషయం తెలిసిన అపార్ట్మెంట్ వాసులు అబ్కారీ శాఖపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అధికారుల చర్యలతో..
బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు అపార్ట్ మెంట్ వాసులకు మంచినీరు అందేలా చర్యలు తీసుకున్నారు. బాధ్యులైన అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో అపార్ట్మెంట్ వాసులు శాంతించారు. కాగా, ఈ అపార్ట్మెంట్ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.