కలాంకు గూగుల్ నివాళి: రామేశ్వరంలో చంద్రబాబు
న్యూఢిల్లీ/రామేశ్వరం: దివంగత భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాంకు గూగుల్ తన డూడుల్తో నివాళులర్పించింది. సోమవారం గుండెపోటుతో కలాం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి నివాళిగా ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ను హోంపేజ్లో పొందుపర్చింది.
సెర్చ్ బాక్స్ కింద నలుపు రిబ్బన్, దాని మీద మౌస్ ఉంచగానే 'ఇన్ మెమోరీ ఆఫ్ ఎపిజె అబ్దుల్ కలాం' అని వచ్చేలా ఏర్పాటు చేసింది. కలాం అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన తమిళనాడులోని రామేశ్వరంలో గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.
రామేశ్వరం చేరుకున్న ప్రధాని మోడీ, ఏపి సిఎం చంద్రబాబు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధురై చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి రామేశ్వరం చేరుకున్నారు. కలాం పార్థీవ దేహానికి ఆయన నివాళులర్పించారు. ఏపి సిఎం చంద్రబాబునాయుడు కూడా గురువారం ఉదయం రామేశ్వరం చేరుకున్నారు. కలాం పార్థీవ దేహానికి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు, భారీ సంఖ్యలు ప్రజలు కలాం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
కలాం పార్థీవ దేహాన్ని చూసేందుకు బారులు తీరిన జనం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు గురువారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగానే కాకుండా ప్రజల రాష్ట్రపతిగా ఖ్యాతి గడించిన కలాంను కడసారి చూసేందుకు ఆయన నివాసం వద్ద ప్రజలు బారులు తీరారు. అశ్రునయనాలతో కలాంకు నివాళులర్పిస్తున్నారు. కలాంను కడసారి చూసేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది రామేశ్వరం చేరుకుంటున్నారు.