ప్రధాని 'మేకిన్ ఇండియా'పై అబ్దుల్ కలాం హెచ్చరిక
ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని స్వాగతిస్తూనే, దానివల్ల విపరిణామాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అభిప్రాయపడ్డారు.ప్రపంచానికి తక్కువ వ్యయమయ్యే విడిభాగాల కూర్పు కేంద్రంగా భారత్ మారకుండా చూడాలని హెచ్చరించారు.
ఈ విషయాలను... తన సహాయకుడు సృజన్ పాల్ సింగ్తో కలసి తాను రాసిన చివరి పుస్తకం 'అడ్వాంటేజ్ ఇండియా: ఫ్రమ్ ఛాలెంజ్ టు ఆపర్చ్యునిటీ'లో అబ్దుల్ కలాం పేర్కొన్నారు. ఇది త్వరలో వెలువడనుంది. జులై 27న షిల్లాంగ్లో ఐఐఎంలో కుప్పకూలడానికి ముందు చివరి ప్రసంగం కూడా అందులో ఉంటుంది.
రాజకీయాలు నాలుగు స్తంభాలాటగా మారిపోతున్నాయన్న అభిప్రాయం ఉందని కలాం పేర్కొన్నారు. అధికారం కొందరికే పరమితమవుతోందన్నారు. ఇతరులకు అవకాశాలు మూసుకుపోతున్నాయన్నారు.
అధికారం.. ఒక అవినీతి నాయకుడి నుంచి మరో అవినీతి నాయకుడికి చేరుతోందని, అవినీతిపరులను శాశ్వతంగా ఏరివేసేలా రాజకీయాలను చక్కదిద్దాలని, కొత్త రక్తానికి, సృజనాత్మకత కలిగిన నేతలకు మార్గం సుగమం చేసే వ్యవస్థ రావాలని ఆకాంక్షించారు.
పార్టీలు పెరిగిపోవడం వల్ల జాతిపై ఎన్నికల భారం పెరుగుతోందన్నారు. 1989లో అగ్ని క్షిపణిని పరీక్షించడానికి కొన్ని గంటల ముందు నాటి క్యాబినెట్ కార్యదర్శి టిఎన్ శేషన్ నుంచి తనకు వచ్చిన ఫోన్ వివరాలనూ కలాం ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
రామేశ్వరానికి తరలనున్న కలాం వస్తువులు
కలాం నివసించిన రాజాజీ మార్గ్ నివాసంలో ఆయనకు సంబంధించిన వస్తువులన్నింటినీ తొలగించనున్నారు. తమిళనాడులో కలాం సొంతూరు రామేశ్వరానికి వాటిని తరలించనున్నారు. రాజాజీ మార్గ్ నివాసంలో పెద్ద సంఖ్యలో పుస్తకాలు, కలాం వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి.
10 రాజాజీ మార్గ్ను ఈ నెల 31లోగా ఖాళీ చేయాల్సిందిగా కలాం వ్యక్తిగత సిబ్బందికి పట్టణాభివృద్ధిశాఖ రెండు నెలల క్రితం నోటీసు ఇచ్చింది. కలాం స్మారకార్థం రాజాజీ మార్గ్ నివాసంలో కానీ, ఢిల్లీలో మరెక్కడైనా కానీ విజ్ఞాన కేంద్రం లేదా స్మారకాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఈ విషయమై వారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ కలిశారు. కలాం స్మారకాన్ని రామేశ్వరంలో నిర్మిస్తామని కేంద్రం తమకు తెలిపిందని ఆయన మనవడు షేక్ సలీమ్ చెప్పారు.