ఎన్డీఏ నుంచి మరో భాగస్వామి ఔట్? బీజేపీతో పొత్తుపై పునరాలోచన
న్యూఢిల్లీ: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్తగా మరో సమస్య ఎదురైంది. ఎన్డీఏ కూటమి నుంచి మరో భాగస్వామ్య పార్టీ వైదొలగడానికి సిద్ధంగా ఉంది. బీజేపీ నాయకత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే.. కూటమి నుంచి బయటికి వెళ్లడం ఖాయమని అప్నాదళ్ ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రాజకీయ పార్టీ అది. 2014 ఎన్నికల్లో రెండు లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. మీర్జాపూర్ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అప్నా దళ్ లోక్ సభ సభ్యురాలు అనుప్రియా పటేల్.. నరేంద్రమోడీ మంత్రివర్గంలో సభ్యురాలు కూడా. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రిగా ఉన్నారామె.
ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైనప్పటికీ, బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర శాఖ నాయకుల నుంచి తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నామని అనుప్రియా పటేల్ తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను బీజేపీ అధిష్ఠానం ముందు ఉంచామని చెప్పారు. వాటిని పరిష్కరించాలని కోరామని అన్నారు. దీనిపై ఇప్పటిదాకా తమకు బీజేపీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని యోచిస్తున్నట్లు అనుప్రియా పటేల్ చెప్పారు. బీజేపీ నుంచి తుది సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఇచ్చామని, అయినప్పటికీ.. బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి ఎలాంటి బదులు రాలేదని అన్నారు. దీనితో బీజేపీతో కుదుర్చుకున్న పొత్తు ఒప్పందాన్ని పున: సమీక్షించుకోవాలని నిర్ణయించామని చెప్పారు.
ప్రస్తుతం తాము ఎన్డీఏలోనే కొనసాగుతున్నామని, ఆ పార్టీ భాగస్వామ్యపక్షంగానే ఉన్నామని అప్నా దళ్ అధ్యక్షుడు, అనుప్రియా పటేల్ భర్త ఆశీష్ పటేల్ తెలిపారు. ఈ భాగస్వామ్యం ఎన్నిరోజులు ఉంటుందనేది చెప్పలేమని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని చెప్పారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో అప్నా దళ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా.. బీజేపీ కేటాయించిన రెండు స్థానాల్లో పోటీ చేసి, విజయం సాధించింది. మీర్జాపూర్, ప్రతాప్ గఢ్ లోక్ సభ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అనుప్రియా పటేల్, కువర్ హరివంశ్ సింగ్ గెలుపొందారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. అనుప్రియా పటేల్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే
ఎన్డీఏ నుంచి బయటికి వస్తే అప్నాదళ్ పార్టీకి కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లో బలమైన ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనేది కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో అప్పాదళ్ కాంగ్రెస్ తో కలిసి వెళ్లడం మినహా మరో మార్గం లేదు. లేదా.. సొంతంగా పోటీ చేయాల్సి ఉంటుంది.