జయలలిత మృతి కేసులో ట్విస్ట్, అందుకే చెప్పలేదు, అపోలో!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి మిస్టరీ ఊహించని మలుపు తిరిగింది. ఆమెను ఊపిరాడని స్థితిలోనే ఆస్పత్రికి తీసుకువచ్చినట్టు శనివారం అపోలో ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ 22న జయలలిత అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని అపొలో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
సంచలన వ్యాఖ్యలు
2016 డిసెంబర్ 5వ తేదీ జయలలిత తుదిశ్వాస విడిచే వరకు 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలోనే చికిత్స చేశారు. జయలలిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు.
వెంటనే కోలుకున్నారు
జయలలితను ఊపిరాడని స్థితిలోనే అపోలో ఆస్పత్రికి తీసుకుని వచ్చారని, వెంటనే తగిన చికిత్స అందించడంతో అమ్మ కోలుకున్నారని ప్రతాప్ సి. రెడ్డి వివరించారు. అయితే చివరికి దురదృష్టవశాత్తూ ఎవరూ ఊహించని ఫలితం వచ్చిందని ప్రతాప్ సి. రెడ్డి అన్నారు
ప్రపంచంలోనే!
ప్రపంచంలోని వైద్య నిపుణులు, ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులను పిలిపించి జయలలితకు సాధ్యమైనంత వరకూ మంచి చికిత్స చేశామని, వైద్యులు చాలా శ్రమించారని ప్రతాప్ సి. రెడ్డి చెప్పారు. జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి ఏక సభ్య కమిషన్ అందరి అనుమానాలు నివృత్తి చేస్తుందని ప్రతాప్ సి. రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఊపిరాడని స్థితిలోనే
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ కమిషన్ నుంచి తమకు ఎటువంటి పిలుపు అందలేదని అపోలో గ్రూప్ ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి శనివారం వెల్లడించారు. జయలలితను ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని ప్రతాప్. సి రెడ్డి చెప్పారు.
అందుకే అప్పుడు చెప్పలేదు
తమిళనాడు రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని జయలలిత జ్వరంతో బాధపడుతున్నారనే ప్రకటనలు ఇచ్చామని ప్రతాప్ సి. రెడ్డి అన్నారు. ఆర్ముగస్వామి విచారణ కమిషన్ నుంచి పిలుపు వస్తే జయలలిత మరణంపై అన్ని వివరాలు ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని ప్రతాప్ సి. రెడ్డి వివరించారు.