మంత్రి సెల్ఫ్ గోల్: జయలలిత చికిత్స, ఆపోలో లో వీడియో చిత్రీకరించారంట!
చెన్నై: తమిళనాడు మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ పప్పులో కాలేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులు ఎలాంటి చికిత్స చేశారు అని మొత్తం వీడియో చిత్రీకరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమె ఫోటోలు బయటకు విడుదల చెయ్యరాదని స్వయంగా అమ్మ మనవి చేశారని అపోలో ఆసుపత్రి యాజమాన్యం, తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టులో నివేదిక సమర్పించి వారం కాకముందే మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అమ్మ చనిపోయే వరకు అపోలో ఆసుపత్రి వైద్యులు ఎలాంటి చికిత్స చేశారు అనే పూర్తి విషయాలను రికార్డు చేశారని మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ చెప్పారు. మంత్రి సంచలన వ్యాఖ్యలతో అన్నాడీఎంకే నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఎవరైనా లోపలికి వెలితే అంటు వ్యాదులు వస్తాయని శశికళ ఎవ్వరినీ జయలలిత చికిత్స పొందుతున్న గదిలోకి అనుమతి ఇవ్వలేదని అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ఆరోపణలు చేసి 24 గంటలు గడువక ముందే మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి.
అమ్మ చికిత్స పొందుతున్న సమయంలో మమ్మల్ని లోపలికి అనుమతించలేదని పన్నీర్ సెల్వం వర్గీయులు, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ తో సహ అన్నాడీఎంకే పార్టీకి చెందిన అనేక మంది కార్యకర్తలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
అమ్మ అమరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని అనేక స్వచ్చంద సంస్థలు, డీఎంకే పార్టీతో సహ అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం జయలలిత మరణంపై వచ్చిన అనుమానాలపై కేసు విచారణ న్యాయస్థానంలో ఉంది.
ఇలాంటి సమయంలో మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేసి కొత్త చర్చకు దారి తీశారు. మంత్రి చెప్పినట్లు జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో వీడియో చిత్రీకరించి ఉంటే ఎందుకు న్యాయస్థానంలో ఆ క్లిప్పింగ్స్ సమర్పించలేదని అమ్మ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.