జయ మృతిపై తుది నివేదిక ఇవ్వడానికి అపోలో నాటకాలు..! హైకోర్టుకు తెలిపిన ఆర్ముగస్వామి కమిషన్..!!
చెన్నై/హైదరాబాద్ : చెన్నై అపోలో ఆసుపత్రి పై జయ మృతిపై విచారణ చేపడుతున్న ఆర్ముగస్వామి కమీషన్ మండిపడింది. జయలలిత మృతిపై తుది నివేదికను అడ్డుకొనేందుకు అపోలో ఆస్పత్రి పిటీషన్ దాఖలు చేసిందని ఆర్ముగస్వామి కమిషన్ మద్రాసు హైకోర్టుకు తెలియజేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్సలు పొందుతు 2016 డిసెంబరు 5వ తేది మృతిచెందిన విషయం తెలిసిందే, ఆమె మరణంపై వాస్తవాలు తెలియజేయాలనే ప్రతిపక్షాల ఆరోపణలపై విచారించేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిషన్ను రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ జయలలిత బంధువులు, ఇంటి పని వారు, శశికళ బంధువులు, అపోలో వైద్యులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నాతాధికారులు, పలువురు మంత్రులను విచారించిన విషయం తెలిసిందే..!
నిన్న అలా నేడు ఇలా: రాఫెల్ డాక్యుమెంట్ల చోరీపై మాట మార్చి ఏజీ వేణుగోపాల్
జయలలితకు అందించిన వైద్యచికిత్సలపై విచారించేందుకు ఆర్ముగస్వామి కమిషన్కు స్టే విధించాలని కోరుతూ ఆపోలో యాజమాన్యం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు రాగా కమిషనర్ తరపున హాజరైన న్యాయవాది మాట్లాడుతూ, జయలలిత మరణంపై సుమారు 90 శాతం మేర విచారణ పూర్తయిందన్నారు. ఇప్పటివరకు 155 మంది సాక్ష్యులను విచారించి వాటిని నమోదుచేశామన్నారు. త్వరలోనే తుది నివేదకను ప్రభుత్వానికి అందజేయనున్నామన్నారు.
తాము జరిగిన వ్యవహారానికి సంబంధించిన వివరాలతో సిఫారసు మాత్రమే చేయగలమని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు. విచారణ తుది దశలో ఉండడంతో దానికి అడ్డుకోవాలనే ఉద్ధేశంతోనే అపోలో యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసిందని ఆరోపించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తులు సుబ్బయ్య, కృష్ణన్రామస్వామిలతో కూడిన ధర్మాసనం విచారణకు 12వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.