లండన్ డాక్టర్ బిల్లుకు అపోలో మెలిక: జయ వేలిముద్రలపై మరో నిజం వెలుగులోకి
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం వ్యవహారంలో ఒక్కో విషయం వెలగు చూస్తోంది. ఆమె వేలిముద్ర నిర్ధారణకు తాను రూ.5 లక్షలు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై డాక్టర్ బాలాజీ స్పందించారు.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం వ్యవహారంలో ఒక్కో విషయం వెలగు చూస్తోంది. ఆమె వేలిముద్ర నిర్ధారణకు తాను రూ.5 లక్షలు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన ప్రభుత్వ వైద్యుడు బాలాజీ అనుకోకుండా మరో విషయం బయటపెట్టారు.
జయలలితకు చికిత్స అందించేందుకు వచ్చిన లండన్ డాక్టర్ బాలే, తాము చెప్పిన హోటల్లో కాకుండా మరో హోటల్లో ఉన్నందుకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఆయన బిల్లు చెల్లించకుండా మొరాయించిందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్ర నిర్ధారణకు తాను డబ్బు తీసుకోలేదని, మంత్రి అందించిన రూ.5 లక్షలు లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బస చేసిన హోటల్ బిల్లు అని చెన్నై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ బాలాజీ పేర్కొన్నారు.
డాక్టర్ బాలాజీ ఖండన
ఆ రూ.5 లక్షలు ప్రభుత్వం తనకు లంచంగా ఇచ్చినట్లు వచ్చిన వార్తలను డాక్టర్ బాలాజీ ఖండించారు. జయకు చికిత్స అందించేందుకు లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బాలే నాలుగు సార్లు చెన్నైకి వచ్చారని, తొలి మూడుసార్లు ఆయన తాజ్ కోరమాండల్ హోటల్లో బస చేశారన్నారు.
అపోలో చెప్పిన హోటల్లో కాకుండా.. తాజ్ కోరమండల్లో..
మొదటి మూడుసార్లు ఒంటరిగా వచ్చిన బాలే, గత అక్టోబర్ 23వ తేది నాలుగోసారి మాత్రం తన కుటుంబ సభ్యులతో వచ్చారని డాక్టర్ తెలిపారు. అప్పుడు ఆయన రెయిన్ ట్రీ హోటల్లో బస చేయాలని అపోలో యాజమాన్యం కోరిందని, కానీ అందుకు ఆయన అంగీకరించలేదని, తాజ్ కోరమాండల్లోనే బస చేశారని వివరించారు.
అపోలో మెలిక
చికిత్స ముగిసిన తర్వాత నవంబర్ 2 తేది వేకువజామున ఆయన లండన్ వెళ్లాల్సి ఉండడంతో 1వ తేదీనే హోటల్ బిల్లు చెల్లించాల్సి ఉందన్నారు. అయితే తాము చెప్పినట్లుగా రెయిన్ ట్రీ హోటల్లో కాకుండా తాజ్ కోరమాండల్లో బస చేసినందున తాము ఆ బిల్లు చెల్లించబోమని అపోలో యాజమాన్యం మెలిక పెట్టిందన్నారు.
లండన్ డాక్టర్ మనస్తాపం
అందుకు డాక్టర్ బీలే తీవ్ర మనస్తాపం చెందారని, ఆ విషయం తెలిసి తాను వెంటనే మంత్రి విజయభాస్కర్కు తెలపడంతో ఆయన తన బంధువు ద్వారా రూ.5 లక్షలు పంపారన్నారు. హోటల్ బిల్లు రూ.4 లక్షల 20 వేల 898 రూపాయలు కాగా, మిగిలిన నగదును మంత్రి బంధువే తీసుకెళ్లారని డాక్టర్ బాలాజీ తెలిపారు. అంతేకాని, తాను జయ వేలిముద్ర నిర్ధారణకు ఎలాంటి నగదును తీసుకోలేదని డాక్టర్ స్పష్టం చేశారు.
జయలలిత వేలిముద్రలు
జయలలిత ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తంజావూరు, తిరుప్పరకుండ్రం తదితర నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆ నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే అభ్యర్థుల బీఫారాలలో పార్టీ ప్రధానకార్యదర్శిగా జయలలిత సంతకానికి బదులు వేలిముద్ర వేశారు. ఈ వేలిముద్రపై ప్రతిపక్షాలు పలు అనుమానం వ్యక్తం చేయడంతో అవి జయవేనని డాక్టర్ బాలాజీ ధ్రువీకరించారు.
విజయభాస్కర్ ఇంట్లో కీలక పత్రాలు
జయలలిత చేతికి సెలైన్లు ఎక్కించి ఉన్నందున ఆ నొప్పితో సంతకం చేయలేకపోయారని, అందుకే తన సమక్షంలోనే వేలిముద్రలు తీసుకున్నారంటూ అప్పట్లో ఆయన వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీ చేసిన సమయంలో వేలిముద్రల నిర్ధారణ కోసం డాక్టర్ బాలాజీకి రూ.5 లక్షలు ఇచ్చినట్లు పత్రాల్లో ఉంది. ఆ పత్రం కూడా నకలు కూడా బయటకు వచ్చింది.