శాస్త్రి మనవడిపై టీఎంసీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్య, బీజేపీకి సీపీఎం మద్దతు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు కల్యాణ్ బెనర్జీ క్షమాపణ చెప్పాలని కేంద్రం, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పకపోతే అభిశంసన తీర్మానం ప్రవేశ పెడతామని హెచ్చరించారు. కల్యాణ్ పైన తీర్మానం పెడితే తాము మద్దతిస్తామని సీపీఎం తెలిపింది.
ఇటీవల ఓ బహిరంగ సభలో కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ పైన నిప్పులు చెరిగిన బెనర్జీ.. బీజేపీ నేత సిద్దార్థ్ నాథ్ సింగ్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దార్థ్ నాథ్ సింగ్ దివంగత ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి మనవడు.
కోల్కతాలో జరిగిన సభలో మాట్లాడుతూ.. లాల్ బహదూర్ శాస్త్రి బతికి ఉంటే.. తనకు ఇలాంటి మనవడు ఉంటాడనుకుంటే తాను పెళ్లి కూడా చేసుకోపోయేవాడినని బాధపడేవారని వ్యాఖ్యానించారు. ఆయన బీజేపీ పైన, సిద్ధార్థ్ నాథ్ సింగ్ పైన దుమ్మెత్తిపోశారు.
ప్రధాని నరేంద్ర మోడీ పైన కూడా నిప్పులు చెరిగారు. 2019లో ప్రధానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మోడీ ఎక్కడి నుండి వచ్చారో అదే గాంధీ నగర్కు ప్రజలు పంపిస్తారన్నారు. కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యల పైన బీజేపీ మండిపడింది. ఆయన తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది.
అదే సమయంలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని పైన చేసిన వ్యాఖ్యలను కూడా బీజేపీ తప్పు పట్టింది. మమత ప్రధాని పైన అన్ పార్లమెంటరీ పదాలు ఉపయోగించిందని రాజ్యసభలో బీజేపీ పేర్కొంది. ఎవరు కూడా అన్ పార్లమెంటరీ పదాలు వాడవద్దని చైర్మన్ సూచించారు.
కల్యాణ్ బెనర్జీ, మమతా బెనర్జీల వ్యాఖ్యలను బీజేపీ ఎంపి తరుణ్ విజయ్ రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ముక్తార్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతలు మాట్లాడుతున్న అభ్యంతరకర వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, మమతా బెనర్జీ ఒత్తిడిలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సీపీఎం బీజేపీకి మద్దతు పలికింది.