నెలనెలా 3 వేలు.. కేంద్ర పింఛను పథకం.. దరఖాస్తులు ప్రారంభం
ఢిల్లీ : కేంద్ర పింఛను పథకానికి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అసంఘటిత రంగ కార్మికులకు నెలనెలా 3వేల రూపాయల పింఛను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. అందులోభాగంగా దేశవ్యాప్తంగా ఆప్లికేషన్లు స్వీకరించే ప్రక్రియ వేగవంతమైంది. ఈ పథకంలో చేరాలనుకునే కార్మికులు మీసేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో 3 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది.
దరఖాస్తుల స్వీకరణ
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే "సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్".. ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు రంగం సిద్దం చేసింది. ఆ మేరకు దేశవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ల స్వీకరణకు పచ్చజెండా ఊపింది కేంద్రం. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకంలో చేరవచ్చు. వయసును బట్టి 55 రూపాయల నుంచి 100 రూపాయల దాకా నెలనెలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో అటు కేంద్రం కూడా కార్మికుల ఖాతాలో కొంత మొత్తం జమచేయనుంది. ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన కార్మికులకు నెలనెలా 3వేల రూపాయల పింఛను అందనుంది. దీనికోసం అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు.
10 కోట్ల మందికి లబ్ధి
అసంఘటిత రంగంలోని కార్మికులకు నెలనెలా పింఛను అందించే విధానం తెరపైకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన దరిమిలా ఈ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పింఛను స్కీమ్ గా గుర్తింపు పొందనుంది. ఈ స్కీమ్ ద్వారా అసంఘటిత రంగంలోని దాదాపు 10 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఆ మేరకు 60 ఏళ్లు నిండినవారికి నెలనెలా 3వేల రూపాయలు పింఛను అందనుంది.
బడ్జెట్ లో 500 కోట్లు
"ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్" పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం.. కార్మికులకు కొంతలో కొంత ఉపశమనం కలిగించనుంది. ఇప్పటివరకు రోజువారీ కూలీ డబ్బులు, నెలజీతంతో సరిపెట్టుకునే కార్మికులకు పింఛను వచ్చే సౌలభ్యం లేకపోయింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎంఎస్వైఎం పథకం కొంత ఊరట అని చెప్పొచ్చు. ఈ స్కీమ్ అమలు కోసం బడ్జెట్ లో 500 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్రం.