అసలే కావేరీ నీటి గొడవ, తమిళ తంబీల పుండు మీద కారం చల్లిన గవర్నర్, వీసీగా కన్నడిగ!
చెన్నై: కావేరీ నదీ నీరు పంపిణి విషయంలో కర్ణాటక తమకు అన్యాయం చేసిందని తమిళనాడులో తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. కర్ణాటక మీద విరుచుకుపడుతున్న తమిళ తంబీలకు మరోసారి తీవ్రస్థాయిలో కోపం వచ్చే విధంగా తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ప్రవర్తించారు. తమిళనాడులోనే నెంబర్ ఒన్ యూనివర్శిటీ అయిన అన్నా యూనివర్శిటీకి రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత వైస్ చాన్స్ లర్ గా కన్నడిగను నియమించడంతో తమిళ తంబీలకు పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది.
కావేరీ నీరు గొడవ
కావేరీ నదీ నీటి పంపిణి విషయంలో తమిళనాడుకు అన్యాయం జరిగిందని, వెంటనే కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ గురువారం తమిళనాడు రాష్ట్ర బంద్ నిర్వహించారు. అదే రోజు అన్నా యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ నియామకం విషయంలో తమిళ ప్రజలు మరింత ఆగ్రహానికి గురి అయ్యే విధంగా తమిళనాడు గవర్నర్ ఓ నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
కన్నడిగ నియమాకం
తమిళనాడు రాజధాని చెన్నైలో ఉన్న అన్నా యూనివర్శిటీ ఆ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా అన్నా యూనివర్శిటీ టాప్ టెన్ లిస్టులో ఉంది. అలాంటి అన్నా యూనివర్శిటీకి కర్ణాటకకు చెందిన ఎంకే. సూరప్పను వైస్ చాన్స్ లర్ గా నియమిస్తూ తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆదేశాలు జారీ చేశారు.
ఎవ్వరూ చిక్కలేదా
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు కోసం తాము పోరాటం చేస్తున్న సమయంలో కర్ణాటకకు చెందిన ఎంకే. సూరప్పను అన్నా యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ గా నియమించి ప్రజలను మరింత రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని, సూరప్ప తప్పా మీకు ఎవ్వరూ చిక్కలేదా అంటూ డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు.
విద్యార్థులు రెచ్చిపోతే !
అన్నా యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ గా ఎంకే. సూరప్ప నియామకాన్ని వెంటనే రద్దు చెయ్యాలని ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. కన్నడిగ అయిన ఎంకే. సూరప్ప నియామకాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తే తీవ్రపరిణామాలు ఎదురౌతాయని ద్రవిడ కళగం నాయకుడు కే. వీరమణి ఆందోళన వ్యక్తం చేశారు.
ఏం చూసి వీసీని చేశారు
అన్నా యూనివర్శిటీ చరిత్ర, సంసృతి ఎంతో గొప్పదని కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే యూత్ విభాగం నాయకుడు, లోక్ సభ సభ్యుడు అన్బుమణి రాందాస్ అన్నారు. అలాంటి అన్నా యూనివర్శిటీకి కన్నడిగుడైన ఎంకే. సూరప్పను నియమించి కావేరీ నీటి పంపిణి విషయంలో మరింత వివాదానాకి కారణం అయ్యేలా చేశారని అన్బుమణి రాందాస్ విరుచుకుపడ్డారు.