అయోధ్య కేసు విచారణ: 10 సెకన్లలో ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఏమి చెప్పారో చూడండి
అయోధ్యలో వివాదాస్పదంగా మారిన రామజన్మ భూమి బాబ్రీ మసీదుల భూమి వ్యవహారం కేసు విచారణ చేసేందుకు జనవరి 10న ఓ ప్రత్యేక బెంచును ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. విచారణ ఎప్పుడు చేస్తామనేది ఆరోజే వెల్లడిస్తామని ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ కౌల్ ధర్మాసనం పేర్కొంది. రోజువారీగా అయోధ్య కేసును విచారణ చేయాలన్న పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2018 నవంబరులో ఈ పిటిషన్ను న్యాయవాది హరినాథ్ రామ్ వేశారు.
30 సెకన్లు కూడా జరగని విచారణ
అయోధ్య కేసు విచారణకు రాగానే కేవలం 10 సెకన్లలోనే న్యాయమూర్తులు స్పందించారు. వివాదాస్పదంగా మారిన ఈ కేసును విచారణ చేసేందుకు ప్రత్యేక బెంచు ఏర్పాటు చేస్తామని చెప్పింది. అయితే ఈ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న ఇద్దరు లాయర్లలో ఒకరు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మరొకరు రాజీవ్ ధవన్లకు తమ వాదనలు వినిపించేందుకు ఆస్కారం లేకుండా న్యాయమూర్తులు పది సెకన్లలో విషయాన్ని తేల్చడం విశేషం. విచారణ కనీసం 30 సెకన్లు కూడా జరగలేదు.
ఒకే రోజు ఒకే అంశంపై 14 పిటిషన్లు విచారణ
అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమిపై అలహాబాదు హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం వీటన్నిటినీ సుప్రీం కోర్టు విచారణ చేసేందుకు సిద్ధపడింది. నాడు ఈ 2.77 ఎకరాల భూమిని సున్నీవక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లా అనే మూడు సంస్థలకు సమానంగా పంచాలని అలహాబాదు హైకోర్టు తీర్పును వెలువరించింది. తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇక 2010 నుంచి అప్పీళ్లు పెండిగులో ఉన్నాయి.
ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వంపై హిందూ సంఘాల ఒత్తిడి
విచారణ సందర్భంగా పలు సంచలన అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. అసలు ఇస్లాం మతంలో మసీదు అనేది అంతర్లీనమై ఉందా అనే ప్రశ్న తలెత్తింది. 1994లో మసీదు ఇస్లాం మతంలో అంతర్భాగం కాదని ఇచ్చిన తీర్పుపై గతేడాది సెప్టెంబరు 27న వాదనలు జరిగాయి. అయితే ఈ అంశంకు సంబంధించి ఐదుగురు సభ్యుల ధర్మాసనంతో విచారణ చేయాలన్న కోరికను త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ఈ క్రమంలోనే చాలా వరకు హిందూ సంఘాలు ఆర్ఎస్ఎస్తో సహా వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. జనవరి 1న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రధాని మోడీ... అయోధ్య విషయంలో న్యాయపరమైన చిక్కులు వీడాకే కార్యాచరణ ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు.