ఇలా చేస్తే అంతేగా: డిసెంబర్లో ఏప్రిల్ ఫూలైన కేంద్రమంత్రి సుప్రియో!
న్యూఢిల్లీ/కోల్కతా: సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. మనకు ఎంతో ఆసక్తికరంగా అనిపించే కొన్ని పోస్టులు వాస్తవాలు కాకపోవచ్చు. అందుకే అవి సరైనవో కావో తెలుసుకున్న తర్వాత ఇతరులకు ఫార్వర్డ్ చేయడం గానీ, షేర్ చేయడం గానీ చేయాలి.
లేదంటే ఇబ్బందులు తప్పవు. తాజాగా, కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అనేకమంది ఫాలోవర్లు ఉన్న కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి తప్పుగా ఏదైనా షేర్ చేస్తే ఎలావుంటుందనే విషయం ఈ ఘటనతో తేలిపోయింది.
ఫూల్ అయ్యా..
తనకు వచ్చిన సందేశాన్ని ట్వీట్ చేసి కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో.. ‘డిసెంబర్ ఫూల్' అయ్యారు. ఇక్కడ విశేషమేంటంటే... ఫూల్ అయినట్లు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా!
ఈ ట్వీట్తోనే ఫూలయ్యారు
‘వచ్చే ఏడాది జనవరి 1, ఫిబ్రవరి 2, మార్చి 3, ఏప్రిల్ 4, మే 5.. ఇలా డిసెంబర్ 12 వరకు అన్ని తేదీలు ఆదివారం అవుతున్నాయి' అని ఉన్న ఓ మెసేజ్ను బాబుల్ ట్వీట్ చేశారు.
నెటిజన్ల హితవు
అయితే జనవరి 1 ఈసారి సోమవారం అవుతుంది. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు వెంటనే ట్వీట్ కింద కామెంట్లు చేశారు. ఇలాంటి నకిలీ వార్తలు షేర్ చేసేముందు ఒకసారి చెక్ చేసుకోవాలని, వెంటనే ట్వీట్ డిలీట్ చేయాలని చెప్పారు. అయితే దానికి మంత్రి స్పందించిన తీరు చాలా ఆకట్టుకుంటోంది.
డిసెంబర్లో ఏప్రిల్ ఫూలయ్యా...
‘ఎవరో ఇలాంటి నకిలీ మెసేజ్ను సృష్టించారు. చాలా కోపం వచ్చింది. కానీ, మీరు చెప్పినట్లు నేను ఈ ట్వీట్ను తొలగించను. ఎందుకంటే మనమందరం తప్పులు చేస్తుంటాం. లేదంటే డిసెంబరులో ఏప్రిల్ ఫూల్ అవుతుంటాం. ఈ మెసేజ్ వల్ల నేను ఫూల్ అయ్యానని ఒప్పుకొంటున్నాను' అని బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు.