సివిల్ సర్వీసెస్లో ఆప్టిట్యూడ్ పేపర్ అవసరం లేదు: ప్రభుత్వానికి యూపీఎస్సీ ప్రతిపాదన
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో మార్పులు చేసేందుకు యూపీఎస్సీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు కచ్చితంగా ఉన్న ఆప్టిట్యూడ్ టెస్టును తీసివేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందు ఉంచింది యూపీఎస్సీ. ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా అభ్యర్థి గ్రహించే శక్తి, కమ్యూనికేన్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ను పరీక్షించడం జరుగుతుంది. జూన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖకు యూపీఎస్సీ ఓ నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆప్టిట్యూడ్ టెస్టును తీసివేయాలని ప్రతిపాదించింది. అంతేకాదు సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేసుకుని హాజరుకాని వారిపై భారీగా పెనాల్టీ విధించాలని ఆ ప్రతిపాదనల్లో కోరింది.
ఇక సీశాట్ రెండో పేపర్ను 2011లో ప్రవేశపెట్టారు. దీనిపై అభ్యర్థుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లీషు, గణితం, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థులకు ఇదొక అదనపు అడ్వాంటేజ్గా మారుతుందని అభ్యర్థులు బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనిపై యూపీఎస్సీ సెక్రటరీ రాకేష్ గుప్తా స్పందించేందుకు నిరాకరించారు. మొదటి పేపర్లో కరెంట్ అఫెయిర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్లపై ప్రశ్నలు ఉంటాయి. ఇక రెండో పేపర్లో అభ్యర్థి గ్రహించే శక్తి, కమ్యూనికేన్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ను పరీక్షించడం జరుగుతుంది. అయితే దీంట్లో క్వాలిఫై అయితే చాలు అనే నిబంధనను 2015లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే మొదటి పేపర్లో అభ్యర్థి క్వాలిఫైయింగ్ మార్కులు తెచ్చుకుంటేనే రెండో పేపర్ను మూల్యాంకరణ చేస్తారు. రెండో పేపర్లో 33శాతం మార్కులు అభ్యర్థులు సాధించాల్సి ఉంటుంది.
ఈ తరహా విధానంపై 2011 నుంచి 2015కు చెందిన అభ్యర్థులు ఇప్పటికీ తమ నిరసనలు తెలుపుతున్నారు. ఆ సమయంలో తాము వెనక్కు నెట్టివేయబడ్డామన్న భావన వారిలో ఉంది. మొదటి పేపర్లో బాగా మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులు రెండో పేపర్లో కూడా మంచి మార్కులు సాధిస్తారనే విశ్వాసాన్ని యూపీఎస్సీ వ్యక్తం చేస్తోంది. అయితే కేవలం క్వాలిఫయింగ్ కోసమే ఉపయోగపడే సీశాట్ రెండో పేపర్ కోసం అభ్యర్థి తన సమయం వృథా చేసుకుంటున్నాడని ఓ అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఒక సివిల్ సర్వెంట్కు సమస్యల పరిష్కారం, నిర్ణయాలు తీసుకోవడం, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలను వెలికి తీసేందుకు సీశాట్ రెండో పేపర్ ఉపయోగపడుతుందని ఓ ఐఏఎస్ అధికారి తెలిపారు. మొత్తానికి రెండో పేపర్లో సమస్యలు అయితే ఉన్నాయనేది ఆయన ఒప్పుకోవడం జరిగింది.