‘ఏఆర్ రెహమాన్ తిరిగి హిందూమతంలోకి రావాలి’
న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై తీసిన చిత్రానికి సంగీతం అందించినందుకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్పై ముస్లిం మత పెద్దలు ఫత్వా జారీ చేసిన నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆయనను తిరిగి హిందూమతంలోకి రావాలని ఆహ్వానించింది. అంతేగాక, రెహమాన్ ‘ఘర్ వాపసీ'కి ఇదే సరయిన సమయమని పేర్కొంది.
రెహమాన్ను హిందువులు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారని విహెచ్పి సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. వ్యాపార కారణాలవల్లనే రెహమాన్ ఇస్లాం మతంలోకి మారారని ఆరోపించారు.
‘రెహమాన్పై ఫత్వా జారీ చేయడం దురదృష్టకరం. దానిలో ప్రతీకార ధోరణి కనిపిస్తోంది.. ఆయన ఒక సినిమాకు సంగీతం అందించారే తప్పించి మతం ఆధారంగా కాదు. తిరిగి హిందూమతంలోకి రావాలని నేను రెహమాన్కు విజ్ఞప్తి చేస్తున్నాను' అని చెప్పారు.
‘హిందూ సమాజం తన కుమారుడి కోసం ఎదురుచూస్తోంది. మేము ఆయనను హృదయపూర్వకంగా స్వాగతించడమే కాకుండా ఎన్ని ఫత్వాలు జారీ చేసినా ఆయనకు ఎలాంటి హానీ జరక్కుండా కూడా చూస్తాం' అని జైన్ అన్నారు.
ఇది ఇలా ఉండగా, ఏ మెస్సెంజర్ ఆఫ్ గాడ్' చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉందని ముంబయికి చెందిన రజా అకాడమీ అభ్యంతరం చెబుతూ రెహమాన్, మజీదిలపై ఫత్వా జారీ చేసింది.
అయితే తాను సదుద్దేశంతోనే ఈ చిత్రానికి సంగీతం అందించానని, ఇస్లాం మతానికి హాని చేసే ఉద్దేశం తనకు లేదని రెహమాన్ స్పష్టం చేశారు. కాగా మహమ్మద్ చిత్రానికి ఇరాన్ డైరెక్టర్ మజీద్ మజీది దర్శకత్వం వహించారు.