పంజాబ్ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్? 'ఆప్' వ్యూహం ఫలిస్తుందా?
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయంపై కన్నేసింది.
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ తరలిపోనున్నారా? పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగబోతున్నారా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయంపై కన్నేసింది. అక్కడ పార్టీ తరపున సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంతవరకూ ఆప్ ప్రకటించలేదు.
అయితే తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పంజాబ్ ఎన్నికల సభలో సంచలన ప్రకటన చేశారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం కావాలంటే.. ఈ ఎన్నికల్లో 'ఆప్'కు ఓటేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
మనీష్ ప్రకటనతో ఒకవేళ పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గనుక గెలిస్తే.. కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి పంజాబ్ కు తరలిపోవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. పంజాబ్ లో ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపడితే, ఢిల్లీ సీఎం బాధ్యతలు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు అప్పగించాలనేది కేజ్రీవాల్ వ్యూహరచనగా చెబుతున్నారు.