బీజేపీకి సహకరిస్తున్నారా : సీట్ల పంపకాల విషయంలో రాహుల్కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
ఢిల్లీ: కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్కు కౌంటర్ ఇస్తోంది.
ఆప్ కోర్టులో బంతి
కాంగ్రెస్ ఆమ్ఆద్మీ పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో సందిగ్దత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బంతిని అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో వేశాడు. ఇక సీట్ల పంపకాల్లో జాప్యం చేస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీనే అంటూ ట్వీట్ చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో అరవింద్ కేజ్రీవాల్ ఫెయిల్ అవుతున్నారని రాహుల్ ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ల మధ్య పొత్తు కుదిరే పరిస్థితి వస్తే కాంగ్రెస్ 4 సీట్లు ఆప్కు కేటాయించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అయితే కేజ్రీవాల్ మాత్రం ఇంకా జాప్యం చేస్తున్నారని. సమయం దగ్గరపడుతోందని చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పటికీ కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉందని చెప్పారు.
రాహుల్కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
ఇదిలా ఉంటే సీట్ల పంపకాల్లో జాప్యానికి కారణం కాంగ్రెస్ అంటూ రివర్స్ అటాక్ చేశారు కేజ్రీవాల్. కాంగ్రెస్ సీట్ల పంపకాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా బీజేపీకి పరోక్షంగా సహకరిస్తోందంటూ వాపోయారు అరవింద్ కేజ్రీవాల్. అసలు పొత్తులపై కాంగ్రెస్ సీరియస్గా లేదని ఆయన ఆరోపించారు. ఉత్తర్ప్రదేశ్లో కూడా ఎస్పీ బీఎస్పీలతో పొత్తు పెట్టుకోకుండా మోడీ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ చీల్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఇక రాహుల్ కు వెంటనే కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. "మీరు చేసిన ట్వీట్ను పరిశీలిస్తే చర్చలు ఇంకా జరుగుతున్నాయనే తెలుస్తోంది. పొత్తు మీకు ముఖ్యం కాదనేలా అర్థమవుతోంది. ఈరోజు మోడీ అమిత్ షాల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఉత్తర్ప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో మోడీ వ్యతిరేకత ఓట్లను చీల్చడం చాలా బాధాకరం " అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
పొత్తు కుదిరితే ఇదీ కాంగ్రెస్ ప్లాన్ ..!
ఢిల్లీలో మొత్తం ఏడు లోక్సభ స్థానాలు ఉండగా... నాలుగు స్థానాలను ఆమ్ఆద్మీ పార్టీకి కేటాయించారు రాహుల్ గాంధీ. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా సీట్ల పంపకాల విషయంలో మాత్రం కేజ్రీవాల్ మొత్తం 33 లోక్సభ స్థానాలు కావాలని పట్టుబడుతున్నారు. అంటే ఢిల్లీ, పంజాబ్, హర్యానా గోవా రాష్ట్రాల్లో 33 లోక్సభ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కేజ్రీవాల్. ఒకవేళ రాహుల్ గాంధీ 3:4 సీట్ల ఫార్ములా వర్కౌట్ అయితే... ఢిల్లీలో మాజీ కేంద్ర మంత్రులు అజయ్ మాకెన్, కపిల్ సిబల్ను పోటీలో నిలిపే యోచన కాంగ్రెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మరో స్థానం నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రధాన అనుచరుడు మాజీ మంత్రి రాజ్కుమార్ చౌహాన్ను కూడా బరిలో దింపే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం.
ఇక ఇప్పటికే ఆప్ ఏడు స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఒక వేళ పొత్తు కుదిరితే చాందిని చౌక్ నుంచి పంకజ్ గుప్తాను . న్యూఢిల్లీ నుంచి బ్రజేష్ గోయెల్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి గుగన్ సింగ్ల పేర్లను జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఇక్కడ చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ కపిల్ సిబల్ను న్యూఢిల్లీ నుంచి అజయ్ మాకెన్ను నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి రాజ్కుమార్ చౌహాన్లను బరిలో నిలపేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇక ఢిల్లీ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి రోజు ఏప్రిల్ 23. సమయం తక్కువగా ఉండటంతో రోజురోజుకీ ఇటు కార్యకర్తల్లోను అటు అభ్యర్థుల్లోను టెన్షన్ పెరిగిపోతోంది. అసలు పొత్తు ఉంటుందా లేదా అనేదానిపై కూడా కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది.