స్కూల్స్ రీ ఓపెన్.. డేంజర్ జోన్ లో విద్యార్థులు ? చిన్నారుల తల్లిదండ్రులకు కరోనా ఫియర్ !!
భారతదేశంలో కరోనా కేసులు భారీగా తగ్గడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, కరోనా నిబంధనలతో పాఠశాలలు నిర్వహించాలని, బెంచ్ కు ఒకరిని మాత్రమే కూర్చోబెట్టాలని రకరకాల నిర్ణయాలు తీసుకొని బడి గంట కొట్టానున్నాయి.అయితే కరోనా థర్డ్ వేవ్ తో పిల్లలకే ప్రధానంగా ముప్పు పొంచి ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో పాఠశాలలు తెరవడం అటు తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు అందరికీ స్కూల్ ఫియర్ పట్టుకుంది.
కొత్త తంటా : ఆ మూడు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ .. ఈ వేరియంట్ ప్రభావంపై ఆందోళన
స్కూల్స్ లో విద్యార్థులు కరోనా రూల్స్ పాటించటం సాధ్యమేనా ?
అన్ని తెలిసి,కరోనా మహమ్మారి గురించి పూర్తిగా అవగాహన ఉన్న పెద్ద వారే మాస్కులు ధరించడం,సామాజిక దూర నిబంధనలు పాటించడం చేయడం లేదు. ఫలితంగానే కరోనా మహమ్మారి వ్యాప్తి రెండవ దశలో విస్తృతంగా జరిగింది. అలాంటిది తెలిసీ తెలియని చిన్న పిల్లలు, మాస్కులు పెట్టుకొని, సామాజిక దూరం పాటిస్తూ స్కూల్స్ కి వెళ్లి చదువుకోవాలంటే అది చాలా కష్టం. స్కూళ్లలో విద్యార్థులు, టీచింగ్ సిబ్బంది,స్కూల్స్ నిర్వహణకు సంబంధించి హెల్పర్స్ ఎంతో మంది పని చేస్తూ ఉంటారు. ఇక విద్యార్థులు పక్క విద్యార్థులతో అసలే మాట్లాడకుండా ఉండరు. ఇలాంటి క్రమంలో ప్రతి రోజు స్కూల్ అయిపోయే వరకు వారి సోషల్ డిస్టెన్స్ పాటించేలా, మాస్కులు ధరించేలా చూడడం టీచర్స్ కు పెద్ద టాస్క్ అవుతుంది.
కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు భయాందోళనలో ప్రజలు ... స్కూల్స్ ఇప్పుడే వద్దని ఆందోళన
అటు పాఠాలు చెప్పడమే కాకుండా ఇటు కరోన నిబంధనలు పాటించడం ఇబ్బందికరంగా మారుతుంది. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి భయపడిపోయారు. విపరీతంగా కరోనా సెకండ్ వేవ్ లో మరణాలు సంభవించడంతో బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితులు ఇంకా ఉన్నాయి. దాదాపు దేశవ్యాప్తంగా మెజారిటీ కుటుంబాలలో కరోనా కల్లోలం సృష్టించింది. ఇలాంటి సమయంలో స్కూల్స్ తెరవడం వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పిల్లలను బడికి ఎలా పంపాలి అని తల్లిదండ్రులు భయపడుతున్నారు. పంపకుంటే చదువులో వెనకబడతారేమో అని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆన్ లైన్ తరగతులనే మరికొంత కాలం కొనసాగిస్తే బాగుంటుందని అంటున్నారు .
థర్డ్ వేవ్ తో చిన్నారులకు ముప్పు అంటూనే స్కూల్స్ తెరవటం ఏమిటి ?
ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయం తీసుకున్నాయని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క కరోన థర్డ్ వేవ్ తో చిన్నారులకు ముప్పు పొంచి ఉంది అని చెప్తూనే, మరో పక్క స్కూల్స్ తెరవడం ఏంటి అని ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే సమయంలో చాలామంది వైద్యనిపుణులు, ఆఖరికి నీతి ఆయోగ్ సభ్యుడు వి కె పాల్ కూడా ఇప్పుడు స్కూల్స్ తెరవడం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడమే పేర్కొన్నారు. పిల్లలకు పూర్తి రక్షణ కల్పించిన తర్వాతనే స్కూల్స్ తెరిచే నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యాక్సిన్ అందించి రక్షణ కల్పించిన తర్వాత స్కూల్స్ తెరవాలన్న నీతి ఆయోగ్ సభ్యుడు
కరోనా పరిస్థితులను అంచనా వేయకుండా పాఠశాలను తెరవడం మంచి నిర్ణయం కాదన్నారు. పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందించి రక్షణ కల్పించిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. గతంలో స్కూల్స్ తెరవడం వల్ల కరోనా మహమ్మారి విజృంభించిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఏదేమైనా కరోనా విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవ్వాల్సిన సమయంలో కాకుండా విజృంభిస్తున్న తర్వాత లాక్ డౌన్ విధించి, అప్పుడు కట్టడి చేయడానికి ప్రయత్నం చేయడాన్ని చాలా మంది నిపుణులు తప్పుబడుతున్నారు.
కరోనా విషయంలో తప్పులో కాలేస్తున్న పలు రాష్ట్ర ప్రభుత్వాలు .. స్కూల్స్ రీ ఓపెన్ నిర్ణయం అలాంటిదే !!
కోవిడ్ విషయంలో అప్రమత్తత అవసరమని, ఇంకా ముప్పు తొలగిపోలేదని, థర్డ్ వేవ్ వస్తుంది అన్న హెచ్చరికల నేపధ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో తీసుకునే ఇటువంటి నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు స్కూల్స్ తెరవాలని నిర్ణయించిన నేపథ్యంలో, నిపుణుల హెచ్చరికలను పరిగణలోకి తీసుకుంటారా .. లేక తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి విద్యార్థులను ప్రమాదంలోకి నెడతారా అనేది తెలియాల్సి ఉంది.
Recommended Video