ఎన్ఆర్సీ జాబితాలో లేనివారు మీ బంధువులా ? కాంగ్రెస్ నేతలపై అమిత్ షా ఫైర్
కాంగ్రెస్ నేతలపై బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్ఆర్సీ) గురించి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటీ అని నిలదీశారు. ఎన్ఆర్సీ జాబితాలో లేని వారు ఏమైనా కాంగ్రెస్ నేతల బంధువులా (కజిన్స్) అని ప్రశ్నించారు. లేదా బంధువులా అని నిలదీశారు. బుధవారం హర్యానాలో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. గురుగ్రామ్ ర్యాలీలో కాంగ్రెస్ నేతలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు.
ప్రేమ వెనక
ఎన్ఆర్సీ జాబితాలో లేని శరణార్థులపై కాంగ్రెస్ వల్లమాలిన ప్రేమ చూపిస్తోందని అమిత్ షా విమర్శించారు. వీరి ప్రేమ వెనుక కారణం ఏంటీ అని ప్రశ్నించారు. వారు మీ బంధువులా ? లేదా కజిన్స్ అని మండిపడ్డారు. శరణార్థులకు సంబంధించి ప్రతీసారి కాంగ్రెస్ అడ్డతగులుతుందని దుయ్యబట్టారు. వారిని పంపి వేయడం ఎందుకు అని, ఎక్కడికి వెళ్తారు అని, ఏం తింటారు అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ వారు మీ చుట్టాలా అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎవరినీ వదలం
2024లోపు దేశంలో అక్రమంగా ఉన్న ప్రతీ ఒక్కరిని బయటకు పంపివేస్తామని పేర్కొన్నారు. దీనికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కానీ, హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా కానీ అభ్యంతరం తెలిపినా పట్టించుకోబోమన్నారు. దేశంలో మోడీ బలమైన ప్రధానమంత్రి అని, అలాగే హర్యానలో ఖట్టర్ కూడా అలాంటి వారేనని స్పష్టంచేశారు.
మీరే బాసులు
మీరు మరోసారి బీజేపీకి అధికారం కట్టబెట్టాలని కోరారు. మీరు కమలానికి ఓటేస్తే గురుగ్రామ్లో సమస్యను అడగొచ్చని.. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అదీ ఇటలీకి వెళ్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఉగ్రవాదం హెచ్చుమీరిందన్నారు. 1990 నుంచి ఇఫ్పటివరకు దాదాపు 40 వేల మంది ప్రజలు చనిపోయారని పేర్కొన్నారు.
ఎందుకు చేయలే
ఆర్టికల్ 370 రద్దు చేసే సాహసాన్ని కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయిందన్నారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిని ప్రస్తావించారు. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా చేసిన అవినీతిని చెప్పారు. మరోవైపు మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా కూడా అవినీతి, రౌడీయిజాన్ని పెంచి పోషించారని చెప్పారు.