మహిళలకు దేశంలో రక్షణ ఉందా: 2012 నిర్భయ ఘటన తర్వాత పెరిగిన అత్యాచారాలు
నిర్భయ ఘటనలో నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. తాను మృతి చెందిన ఏడేళ్లకు నిర్భయ ఆత్మ శాంతించింది అని చెప్పొచ్చు. నిర్భయ తల్లిదండ్రులు ఏడేళ్ల పాటు కోర్టుల్లో చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. చివరి నిమిషం వరకు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ ఘటన నిందితులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మార్చి 20 సరిగ్గా 5:30 గంటలకు నలుగురు నిందితులు ఉరితీయబడ్డారు. ఇదిలా ఉంటే 2012లో కదిలే బస్సులో నిర్భయపై అత్యంత పాశవికంగా విరుచుకుపడ్డారు ఆరుగురు మృగాళ్లు. ఇందులో ఒకరు మైనర్ కాగా మూడేళ్ల పాటు జైలులో ఉండి విడుదలయ్యాడు. మరొకడు రాంసింగ్ 2015లో తీహార్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక మిగతా నలుగురిని శుక్రవారం ఉదయం ఉరి తీయడం జరిగింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు
నిర్భయ ఘటన జరిగనప్పటి నుంచి కూడా వ్యవస్థలో ఏదైనా మార్పు వచ్చిందా అంటే అలాంటిదేమీ కనిపించడం లేదు. ఇంకా రోజుకు దేశంలో 24 అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్నాయి. 2012లో మొత్తం 24,923 అత్యాచార కేసులు నమోదు కాగా అందులో నిర్భయది కూడా ఒకటి ఉండటం విశేషం. అంటే రోజుకు 68.28 అత్యాచారం కేసులు నమోదు అయ్యేవని అర్థం. ఇక నిర్భయపై అత్యాచారం జరిగిన రోజునే ఈశాన్య రాష్ట్రం అయిన మేఘాలయాలో కూడా ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘోరం తురా జిల్లాలో జరిగింది. ఈ మైనర్ బాలికపై 16 మంది మృగాళ్లు సామూహిక అత్యాచారం చేశారు. 2014లో ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని దోషులుగా తేల్చింది కోర్టు.
నిర్భయ ఘటన రోజే మేఘాలయాలో మరో ఘటన
నిర్భయ తన స్నేహితుడితో కలిసి సినిమాకు వెళ్లి వస్తుండగా అత్యాచారం జరుగింది. ఇక మేఘాలయా బాధితురాలు విలియంనగర్లో వింటర్ ఫెస్టివల్కు హాజరై వస్తుండగా ఆమెపై మృగాళ్లు తెగబడ్డారు. ఆమె తలపై బద్మాష్ గాళ్లు ఇటుకతో కొట్టి గాయపర్చారు. 2012లో నిర్భయపై జరిగిన అత్యచారంను ఖండిస్తూ ఆ కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ నాడు దేశం మొత్తం రోడ్డుపైకి వచ్చి నినదించారు. ఆ నినాదాలు ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాను తాకాయి. ఒక మహిళకు జరిగిన అన్యాయంపై సమాజం స్పందించిన తీరు మార్పుకు సంకేతం ఇచ్చింది. అత్యాచారం చేసినవారికి కఠిన శిక్షను అమలు చేసేలా చట్టాలు తీసుకురావాలనే డిమాండ్ ఊపందుకుంది.
2018లో రోజుకు సగటున 91.38 అత్యాచార కేసులు నమోదు
ఇదిలా ఉంటే ఏడేళ్ల తర్వాత నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలుకావడంతో నిర్భయ ఆత్మకు శాంతి లభించినట్లయ్యింది. అయితే జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇస్తున్న సమాచారం ప్రకారం ఇంకా దేశంలోని మహిళలకు న్యాయం జరగాల్సి ఉందనే చెప్పాలి. 2012లో రోజుకు 68 మంది మహిళలపై అత్యాచారం జరిగాయని రికార్డులు చెబుతుండగా... 2018 నాటికి ఈ సంఖ్య 91.38కి చేరుకుందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమాచారం ద్వారా తెలుస్తోంది. 2018లో మొత్తం 33,356 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అయితే 2016లోనే 38,947 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే 2016లో రోజుకు సగటున 106.7 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 2012 నుంచి అత్యాచార కేసులు ఏమాత్రం తగ్గలేదు. 2013లో రోజుకు సగటున 92.34 కేసులు నమోదయ్యాయి. 2014లో 36,735 కేసులు నమోదు కాగా 2015లో 34,651 కేసులు నమోదయ్యాయి. 2017లో అత్యల్పంగా 32,559 కేసులు నమోదయ్యాయి.
న్యాయప్రక్రియలో జాప్యం
ఇక జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇస్తున్న సమాచారం ప్రకారం దేశరాజధానిలో అత్యాచారంకు గురైన నిర్భయ ఘటన తర్వాత మహిళలకు ఇంకా రక్షణ లేదనే తెలుస్తోంది. ఇందుకు కారణం న్యాయప్రక్రియలో ఉన్న లొసుగులను వినియోగించుకుని చాలామంది నిందితులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. 2017లో పెండింగ్లో ఉన్న కేసులు అత్యధికంగా ఉన్నాయి. 2017కు సంబంధించి దాదాపు 32శాతం కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2018లో అత్యాచార ఘటనల్లో 4,708 మందిని దోషులుగా తేల్చడం జరిగింది. ఇక ఆ ఏడాది నమోదైన మొత్తం కేసుల సంఖ్య 33,356గా ఉన్నాయి. ఇక మిగతా కేసులు ఇంకా ఎన్నేళ్లు సమయం తీసుకుంటాయో చెప్పలేం. ఎప్పటికి శిక్ష అమలవుతుందో చెప్పలేం. వాస్తవానికి నిర్భయ కేసులో ట్రయల్ కోర్టు వెంటనే తీర్పు ఇచ్చినప్పటికీ న్యాయప్రక్రియ మాత్రం ఏడేళ్ల పాటు జరిగింది. నిర్భయ తల్లి ఆశాదేవీ కూడా ఈ విషయాన్నే ప్రశ్నిస్తున్నారు. చట్టాల్లో మార్పు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంటే నిందితుల నేర నిర్ధారణ జరిగిన వెంటనే శిక్ష అమలు చేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.