పూజా మండపంలో దుర్గాసప్తపతి, నమాజ్లో పాల్గొంటున్న అర్మానీ ఖాన్
పాట్నా: దేశవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. దేశంలో మతాలకు అతీతంగా పలువురు అమ్మవారి పూజలో పాల్గొంటున్నారు. ఇటీవల కేరళలో ముస్లీం సోదరులు నమాజ్ చేసుకోవడానికి హిందూ ఆలయాలు తెరుచుకున్న విషయం తెలిసిందే. హిందూ దేవాలయాల యాజమాన్యం, పూజారుల పరమత గౌరవానికి ఇది నిదర్శనంగా కనిపించింది.
దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బీహార్లోను ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. పశ్చిమ చంపరాణ్లోని బగాహ్ ప్రాంతంలో ఇది జరిగింది. బగాహ్ ప్రాంతంలో నిర్వహిస్తున్న నవరాత్రి వేడుకల్లో ముస్లీం సోదరుడు అర్మానీ ఖాన్.. దుర్గామాతకు పూజలు చేస్తున్నారు. అదే సమయంలో పూజా మండపంలోనే నమాజ్ చేస్తున్నాడు.
దుర్గామాతకు హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఈ మండపంలో ప్రతీరోజు భక్తులు అమ్మవారి సప్తసతిని పఠిస్తుంటారు. ఈ తొమ్మిది రోజులూ అర్మానీఖాన్ మండపంలోనే ఉంటూ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ, అక్కడే నమాజ్ కూడా చేస్తున్నాడు.