నేడు త్రివిధ దళాల పతాక దినోత్సవం: త్యాగానికి ప్రతిరూపం సైనికుడు...రండి వారిని ఆదుకుందాం
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన వెంటనే త్రివిధ దళాల్లో పనిచేసే వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా త్రివిధ దళాల ఫ్లాగ్ డేను ఏటా డిసెంబర్ 7న జరుపుతారు. ఇక 1949 నుంచి ప్రతి ఏటా ఆర్మ్డ్ఫోర్సెస్ ఫ్లాగ్డేను ప్రభుత్వం ఒక వేడుకలా జరుపుతోంది. దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం దేశంలోని సామాన్య ప్రజలకు జెండాలను పంచి వారి నుంచి విరాళాలు సేకరించి వాటిని త్రివిధ దళాల్లో పనిచేస్తున్న జవాన్లకు వారి మరణాంతరం వారి కుటుంబ సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు. ఫ్లాగ్డే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనదేశాన్ని అనునిత్యం పహారా కాస్తూ రక్షణ కవచంలా నిలుస్తున్న సైనికుల సంక్షేమం ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలి.
1954 డిసెంబర్ 7న నాటి ప్రధానిగా ఉన్న నెహ్రూ తాను కొన్ని రోజుల క్రితం భారత్ చైనా సరిహద్దుకు వెళ్లినట్లు తెలిపారు. అక్కడ మన భారత జవాన్లు ఎంతో ఉత్సాహంగా కనిపించారని చెప్పారు. తమ కుటుంబాలను వీడి అక్కడ దేశం కోసం రావడం నిజంగా గర్వించదగ్గ విషయం అని చెప్పారు. అంతేకాదు అక్కడ ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు జవాన్లు అని గుర్తు చేశారు ప్రధాని. దేశ ఖ్యాతిని వారు వ్యాపింపజేశారని చెప్పారు నెహ్రూ. జవాన్లు దేశ నలుమూలల నుంచి వచ్చినప్పటికీ ఎలాంటి విబేధాలు లేకుండా... దేశాన్ని రక్షించుకోవాలన్న ఏకైక అజెండాతో వారు అక్కడికి వచ్చి కలిసిమెలిసి ఉన్నారని నెహ్రూ చెప్పారు. దేశానికి సర్వం ధార పోస్తున్న జవాన్ల సంక్షేమం కోసం ఒక నిధిని సమకూర్చాలని భావించి ప్రతి ఫ్లాగ్ డే రోజున విరాళాలు ఇచ్చి వారి తోడ్పాటుకు సహకరిద్దాం అని నెహ్రూ పిలుపునిచ్చారు.
ఫ్లాగ్డే జరుపుకునేందుకు మూడు ముఖ్యమైన కారణాలున్నాయి. యుద్ధ సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి పునరావాసం కల్పించడం, దేశం కోసం త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సైనికులు వారి కుటుంబ సంక్షేమం కోసం, దేశం కోసం సేవ చేసి రిటైర్ అయిన మాజీ సైనికుల కుటుంబం సంక్షేమం కోసం ఫ్లాగ్డేను నిర్వహిస్తారు. దేశం కోసం పోరాడుతున్న సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం... దేశం కోసం పోరాడి వీరమరణం పొందిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం విరాళం ఇచ్చి ప్రతి ఒక్కరం దేశభక్తిని చాటడమే కాదు అమరుల నివాళులు కూడా అర్పించినట్లు అవుతుంది. ఈ రోజున త్రివిధ దళాలు అంటే భారత ఆర్మీ, భారత నేవీ, భారత వాయుసేనలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు.
దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరుల కుటుంబాల సంక్షేమం కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా సోషల్ మీడియాలో విజ్ఞప్తుల వెల్లువ వస్తోంది. ట్విటర్ వేదికగా చాలా మంది సైనికుల సంక్షేమం కోసం పేటీఎం ద్వారా విరాళాలు అందిస్తున్నారు. దేశం కోసం అమరులైన జవాన్లను ఈ ఫ్లాగ్డే రోజున స్మరించుకుంటూ వారి కుటుంబాల సంక్షేమం కోసం పేటీఎం ద్వారా విరాళాలు ఇద్దామంటూ నెటిజెన్లు పేటీఎం నెంబరు 8800462175ను షేర్ చేస్తున్నారు.