చైనా లేదా పాకిస్తాన్పై మెరుపు దాడి ప్లాన్ ? 15రోజులకు ఆయుధాలు, మందుగుండు సిద్దం
చైనాతో ఎనిమిది నెలలుగా సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు మెరుపుదాడే సరైన అస్త్రంగా భారత్ భావిస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా అందిన ఓ నివేదిక ప్రకారం పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లోని సైనికులకు 15 రోజుల తీవ్రమైన యుద్ధానికి అవసరమైన మందుగుండు, ఆయుధాలు సిద్ధం చేసుకోవాలని వెళ్లిన ఆదేశాలే ఇందుకు కారణం.
తూర్పు లడఖ్లో చైనాతో నెలకొన్న ప్రతిష్టంభనను ఎదుర్కొనేందుకు సైన్యానికి రూ.50 వేల కోట్ల విలువైన మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వదేశీ, విదేశీ మార్గాల ద్వారా సమకూర్చుకునేందుకు తాజాగా అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ప్రతీ పది రోజులకు సరిపోయే మందుగుండు, ఆయుధాలు అందుబాటులో ఉంచుతుండగా.. దీన్ని 15 రోజులకు పెంచాలని తాజాగా ఆదేశాలు అందాయి. ఇవి చైనాతో పాటు పాకిస్తాన్పై దాడులకు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.
ఒకప్పుడు సరిహద్దుల్లో 40 రోజులకు సరిపడా ఆయుధాలు, మందుగుండు నిల్వలు ఉంచేవారు. కానీ మారిన పరిస్ధితుల్లో ఆయుధాల్లో వస్తున్న మార్పులు, నిల్వ చేసే పరిస్ధితులు లేకపోవడంతో దాన్ని 10 రోజులకు తగ్గించారు. కానీ తాజాగా దీన్ని 15 రోజులకు పెంచడం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే మాజీ రక్షణమంత్రి పారికర్ హయాంలో త్రివిధ దళాధిపతులకు ఉన్న ఆర్ధిక వ్యయ అనుమతిని కూడా రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచారు. అలాగే అత్యవసర సమయాల్లో రూ.300 కోట్లు ఖర్చపెట్టి ఎలాంటి ఆయుధాలను అయినా తెప్పించుకునే అవకాశం కల్పించారు.