పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం: ముత్తూట్ ఫైనాన్స్లో 25 కిలోల బంగారం, రూ. 96వేలు అపహరణ
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీ దొంగలు భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరించుకుపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోసూరు-బాగలూరు రోడ్డులో ఉన్న ముత్తూట్ కార్యాలయంలో ఈ దోపిడీ జరిగింది.
శుక్రవారం ఉదయం ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం తెరచుకున్న కొద్ది సేపటికే అంటే ఉదయం 9.30 గంటల సమయంలో ఆరుగురు దుండగులు చొరబడి 25 కిలోలకు పైగా బంగారం ఎత్తుకెళ్లారు. దీని విలువ సుమారు రూ. 7.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అంతేగాక, లాకర్లలో ఉన్న రూ. 96వేల నగదు కూడా దోచుకెళ్లినట్లు ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. దోపిడీ దొంగలు ముఖాలకు మాస్కులు ధరించి హెల్మెట్లు పెట్టుకుని లోపలికి ప్రవేవించినట్లు చెప్పారు. సెక్యూరిటీ గార్డును కొట్టి లోపలికి తీసుకెళ్లారు. ఆ సమయంలో కార్యాలయంలో ఐదుగురు సిబ్బంది, ముగ్గురు కస్టమర్లు ఉన్నారు.
కాగా, మేనేజర్, నలుగురు సిబ్బందిని తుపాకులతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారు. సమాచారం అందిన వెంటనే ఎస్పీ బండి గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించడంతోపాటు, సిబ్బందిని విచారిస్తున్నారు.
Recommended Video
ఈ దొంగల ముఠాను పట్టుకునేందుకు పది ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీ పేరయ్య తెలిపారు. దోపిడీ దొంగలు కర్ణాటకకు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మూడు బృందాలు బెంగళూరుకు వెళ్లాయని, మిగతా బృందాలు కూడా గాలిస్తున్నాయని తెలిపారు.