CAA నిరసన ప్రదర్శనలో దారుణం: విద్యార్థులపై కాల్పులు: స్వాతంత్య్రం కావాలా అంటూ బీభత్సం!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ఆందోళనలను చేపట్టిన నిరసనకారులపై గుర్తు తెలియని యువకుడొకడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థి ఒకరు గాయపడ్డారు.ఆయనను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు.
జామియా విద్యార్థులపై
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో కొంతకాలంగా కొనసాగుతూ వస్తోన్న నిరసన ప్రదర్శనల పర్వం.. ఈ కాల్పుల ఘటనతో మరింత ఉద్రిక్తతకు దారి తీసినట్టయింది. న్యూఢిల్లీలోని షహీన్ బాగ్ వద్ద నిరసన చేస్తోన్న ప్రదర్శనకారులకు మద్దతుగా జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు గురువారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.
షహీన్ బాగ్ వైపు వెళ్తుండగా కాల్పులు..
జామియా విద్యార్థులు చేపట్టిన ఈ ర్యాలీలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్శిటీ విద్యార్థులు భాగస్వామ్యులయ్యారు. వారంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్యాంపస్ ఆవరణ నుంచి షహీన్ బాగ్ వరకు ఓ మహా ప్రదర్శనను నిర్వహించారు. జామియా క్యాంపస్ను దాటుకుని షహీన్ బాగ్ వైపు విద్యార్థులంతా తరలి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని యువకుడొకడు ర్యాలీకి ఎదురయ్యాడు.
విద్యార్థికి బుల్లెట్ గాయాలు..
తన వెంట తెచ్చుకున్న తుపాకీని ప్రదర్శనకారులపైకి ఎక్కు పెట్టాడు. `యే లో ఆజాదీ..(స్వాతంత్య్రాన్ని తీసుకోండి) అంటూ పెద్ద ఎత్తు నినాదాలు చేశాడు. ఊహించని ఈ ఘటనతో జామియా మిల్లియా విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. వారంతా అతణ్ని వారించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థి బుల్లెట్ తగిలింది. బుల్లెట్ గాయాలతో అక్కడే కుప్పకూలిపోయిన ఆ విద్యార్థిని ప్రదర్శనకారులు సమీప ఆసుపత్రికి తరలించారు.
అదుపులో నిందితుడు..
ఈ ఘటనకు పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. అతని నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఉద్దేశపూరకంగా కాల్పులు జరిపి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వాడనేది ఇంకా తెలియాల్సి ఉందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నేర నేపథ్యం ఏదైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
గోపాల్గా తనకు తానుగా..
ఈ ఘటనకు పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను తాను అతను గోపాల్గా చెప్పుకొన్నాడు. గాయపడిన విద్యార్థిని షాదబ్ నాజర్గా గుర్తించారు. జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ విద్యార్థి. గాయపడిన ఆయనను జామియా ప్రాంతంలోని హోలి ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు. గోపాల్గా చెప్పుకొన్న వ్యక్తి పూర్తి వివరాలు, అతని నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఉద్దేశపూరకంగా కాల్పులు జరిపి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వాడనేది ఇంకా తెలియాల్సి ఉందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నేర నేపథ్యం ఏదైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.