వాళ్లను చంపేందుకు అనుమతి తీసుకోవాలా?
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. చివరి విడత ప్రచారంలో నాయకులు బిజీ అయ్యారు. నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలు మరింత వేడి పుట్టిస్తున్నాయి. తాజాగా ఉగ్రవాదుల విషయంలో కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు.
ఈసీ అనుమతి తీసుకోవాలా?
ఉత్తర్ప్రదేశ్ ఖుషీనగర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జమ్మూకాశ్మీర్ సోఫియాన్లో జరిగిన ఎన్కౌంటర్ను ప్రస్తావించారు. ఈ ఘటనపై దేశంలో ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే ఉగ్రవాదులపై సైన్యం కాల్పులు జరుపుతోందన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టెర్రరిస్టులపై కాల్పులు జరిపే ముందు సైనికులు ఈసీ అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు.
మహాకూటమిపై నిప్పులు
ప్రచారంలో భాగంగా ఎస్పీ, బీఎస్పీ కూటమిపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. అఖిలేష్, మాయావతి ఇద్దరూ కలిసి యూపీకి సీఎంగా పనిచేసిన కాలం కంటే ఎక్కువ సమయం తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నానని గుర్తు చేశారు. ఆల్వార్ సామూహిక అత్యాచారం కేసులో బీఎస్పీ చీఫ్ మాయవతి మొసలి కన్నీరు కారుస్తున్నారని మోడీ మండిపడ్డారు. ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఎందుకు ఉపసంహరించుకోలేదని ప్రశ్నించారు. ఈసారి ఎన్నిక్లలోనూ విపక్షాలకు ఓటమి తప్పదన్న ప్రధాని.. యూపీ ఓటర్లు సమర్థ ప్రభుత్వానికే పట్టం కడతారని ధీమా వ్యక్తంచేశారు.
మరోసారి సైన్యం ప్రస్తావన
ఇదిలా ఉంటే యూపీ ఖుషీనగర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మరోసారి భారత సైన్యం గురించి ప్రస్తావించడంపై చర్చకు దారితీసింది. ప్రధాని పదే పదే సైన్యం, బాలాకోట్ దాడుల గురించి ప్రస్తావిస్తోందంటూ కాంగ్రెస్ ఇప్పటికే ఈసీకి పలుమార్లు ఫిర్యాదులు చేసింది. సరిహద్దుల్లో రక్షణ కల్పించే సైన్యాన్ని రాజకీయాల కోసం వాడుకోవడంపై పలువురు రిటైర్డు ఆర్మీ అధికారులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సైతం ఆర్మీకి సంబంధించిన విషయాలు ప్రచారంలో ప్రస్తావించరాదని స్పష్టం చేసింది.