త్రివిధ దళాధిపతులను మించిన హోదా: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కు బంపర్ ఆఫర్?
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా మన దేశంలో ఉన్నవి త్రివిధ దళాలే. పదాతి దళం, నౌకాదళం, వైమానిక దళాలు మాత్రమే మనకు తెలిసినవి, మనం చదువుకున్నవి కూడా. తాజాగా- ఈ మూడింటికి మించిన మరో హోదా ఏర్పాటు కాబోతోంది. అదే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్). త్రివిధ దళాలను మించిన హోదా అది. త్రివిధ దళాధిపతులు సైతం ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కు సెల్యూట్ కొట్టి తీరాల్సిందే. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగుర వేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో ఈ హోదా గురించి ప్రస్తావించారు. అలాంటి హోదాను ఒకటి కొత్తగా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఈ హోదా గల పోస్ట్ ను రూపొందించబోతున్నామని అన్నారు.
ఏపీ, తెలంగాణ రాజకీయాలపై కన్నేసిన బీజేపీ జెయింట్ కిల్లర్
తొలి సీడీఎస్ ఛాన్స్.. బిపిన్ రావత్
మొట్టమొదటి చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ పదవి కోసం బిపిన్ రావత్ పేరును కేంద్ర పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిపిన్ రావత్ మరెవరో కాదు.. ఆర్మీ చీఫ్. పదాతిదళాధిపతిగా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. ఆయనను సీడీఎస్ తొలి చీఫ్ గా నియమించే అవకాశం ఉన్నట్లు దేశ రాజధానిలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆర్మీలో ఫైవ్ స్టార్ ర్యాంక్ గల మేజర్ జనరల్ ను మించిన పోస్ట్ కావడం వల్ల ప్రస్తుతానికి ఆయన ఒక్కరే సీడీఎస్ చీఫ్ హోదాకు సరితూగగలరని అంటున్నారు. పదాతిదళంలో అనేక కీలక హోదాల్లో బిపిన్ రావత్ పనిచేశారు. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ లల్లో భారత సరిహద్దుల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సమస్యాత్మ, సున్నిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులను నిర్వర్తించిన గుర్తింపు బిపిన్ రావత్ కు ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఏర్పాటు చేయబోయే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఆయన పేరును ప్రతిపాదించవచ్చని సమాచారం.
ఇప్పటిది కాదీ డిమాండ్..
నిజానికి- చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ హోదాతో ఓ ప్రత్యేక విభాాగాన్ని ఏర్పాటు చేయలనే డిమాండ్ ఇప్పటిది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1999లో కార్గిల్ యుద్ధం అనంతరం తొలిసారిగా దీనిపై దృష్టి సారించింది అప్పటి అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం. దేశ భద్రతకు సంబంధించిన ఎలాంటి విషయాన్నయినా చర్చించాలంటే..కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాధిపతులను సంప్రదించాల్సి ఉంది. ఆ ముగ్గురి అభిప్రాయాన్ని తీసుకున్న తరువాతే.. రక్షణ పరంగా ముందడుగు వేయాల్సి వచ్చేది. ఫలితంగా- సమన్వయం అనేది ఆశించిన స్థాయిలో, అప్పటికప్పుడు కుదిరేది కాదని చెబుతున్నారు. ఈ ముగ్గురినీ సమన్వయం చేసే మరో విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అప్పట్లో వాజ్ పేయి ప్రభుత్వం గుర్తించింది. ఆలోచన చేయగలిగింది గానీ.. దీనిపై అప్పటికప్పుడు అమలు చేయలేకపోయింది.
మన్మోహన్ హయాంలో కదలికలు..
2012లో మన్మోహన్ సింగ్ హయాంలో ఈ ప్రతిపాదనల్లో కదలిక నెలకొంది. సీడీఎస్ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన నివేదికలను అందజేయడానికి యూపీఏ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి కేంద్ర కేబినెట్ కార్యదర్శి నరేష్ చంద్ర నేతృత్వంలో ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. త్రివిధ దళాలతో సంప్రదించిన అనంతరం నరేష్ చంద్ర.. కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు. సీడీఎస్ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తన నివేదికలో స్పష్టం చేశారు. ఆ తరువాాత 2014 నాటి ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం, కేంద్రంలో ఎన్డీఏ గద్దెనెక్కడంతో ఈ ప్రతిపాదనలు మరోసారి అయిదేళ్ల పాటు అటకెక్కాయి. తాజాగా- నరేంద్ర మోడీ ప్రకటనతో ఇది కాస్తా కార్యరూపం దాల్చబోతోంది.
సీడీఎస్ ఏర్పాటు వల్ల
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ హోదాతో ఓ ప్రత్యేక విభాగం అంటూ ఏర్పడితే.. కేంద్రానికి వెసలుబాటు లభిస్తుంది. జాతీయ భద్రత వ్యవహారాల్లో కేంద్రం తక్షణ నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. త్రివిధ దళాధిపతులను ఒకే చోటికి చేర్చి, వారి అభిప్రాయాలను స్వీకరించే అవసరం ఉండదు. ఆ పనులన్నింటినీ సీడీఎస్ చీఫ్ చూసుకుంటారు. సీడీఎస్ చీఫ్ ఒక్కరినే సంప్రదిస్తే చాలు. ఫలితంగా- దేశ భద్రత వ్యవహారాల్లో తక్షణ నిర్ణయాలు గానీ, అప్పటికప్పుడు చర్యలు గానీ తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. సర్జికల్ స్ట్రైక్ ల ను నిర్వహించాల్సి వచ్చిన సమయంలో కేంద్రం త్రివిధ దళాధిపతులను సంప్రదించినప్పుడు సమన్వయ లేమి కనిపించిందని, దాన్ని అధిగమించడానికి సీడీఎస్ ను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రధాని ప్రకటించారని నిపుణులు అంచనా వేస్తున్నారు.