సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం: కాశ్మీర్ కు ఆర్మీ చీఫ్: పాక్ కళ్లన్నీ ఆయన టూర్ మీదే
Recommended Video
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో కొద్దిరోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ బిపిన్ రావత్ ఆ రాష్ట్రాన్ని సందర్శించడానికి వెళ్లనున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్ తో యుద్ధం తప్పదని పాకిస్తాన్ రైల్వే మంత్రి సూచన ప్రాయంగా వెల్లడించడం, ఆ ప్రకటన వెలువడిన మరుసటి రోజే పాకిస్తాన్ వైపున సరిహద్దుల్లో పెద్ద ఎత్తున స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్జీ) కమెండోలను మోహరింపజేయడం వంటి అంశాలు క్రమంగా యుద్ధ వాతావరణానికి దారి తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బిపిన్ రావత్.. శ్రీనగర్ పర్యటనకు వెళ్లడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం బిపిన్ రావత్ ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లబోతుండటం ఇదే తొలిసారి.
వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు..పోస్టులు: తెలంగాణ వాసి అరెస్ట్
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కారణాలు ఏమైనప్పటికీ.. అక్కడి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బీజేపీయేతర రాజకీయ పార్టీల నాయకులను అడుగు పెట్టనివ్వట్లేదు భద్రతా బలగాలు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం వంటి పార్టీల సీనియర్ నేతలు జమ్మూ కాశ్మీర్ వెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ.. శ్రీనగర్ ఎయిర్ పోర్టులోనే భద్రతా బలగాలు వారిని అడ్డుకుని వెనక్కి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికితోడు- పొరుగు దేశం కయ్యానికి కాలు దువ్వుతోంది. యుద్ధానికి సిద్ధపడాలంటూ సంకేతాలను జారీ చేసింది. క్షిపణి పరీక్షలు నిర్వహించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద వద్ద రోజూ ఏదో ఒక సందర్భంలో పాకిస్తాన్ జవాన్లు కాల్పులకు దిగుతున్నారు.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ జమ్మూ కాశ్మీర్ వెళ్లబోతుండటం పట్ల పాకిస్తాన్ సైతం అప్రమత్తమైంది. ఆక్ష్న పర్యటనపై నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. బిపిన్ రావత్ పర్యటన సందర్భంగా భారత్ నుంచి ఆసక్తికరమైన ప్రకటన ఏదైనా వెలువడవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఆర్మీ చీఫ్ పర్యటన అనంతరం జమ్మూ కాశ్మీర్ లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమౌతాయనే అంశంపై ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ వైపు నుంచి గానీ, ఆ దేశ సైన్యం వైపు నుంచి గానీ ఎలాంటి ప్రకటనలు వెలువడినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దాన్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటామని పాకిస్తాన్ సైన్యాధికారి కమర్ జావేద్ బజ్వా స్పష్టం చేశారు.