హోం మంత్రిని కలిసిన ఆర్మీ చీఫ్: త్వరలో 'ఆపరేషన్ ఆలౌట్' ప్రారంభం
న్యూఢిల్లీ: అస్సాంలో హింసాకాండకు పాల్పడ్డ బోడో తీవ్రవాదులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్... కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను శుక్రవారం ఉదయం ఢిల్లీలోకలిశారు. అస్సాంలో బోడో తీవ్రవాదుల హింసాత్మక ఘటనపై వీరిద్దరూ చర్చించారు.
అనంతరం ఆయన రిపోర్టర్స్తో మాట్లాడుతూ అస్సాంలో సైనిక కార్యాచరణను తీవ్రం చేస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్సింగ్ సుహాగ్ స్పష్టం చేశారు. అస్సాంలో బోడోల తీవ్రవాదుల నిర్మాలనకు రంగంలోకి దిగాలన్న రాజ్నాథ్ సింగ్ ఆదేశం మేరకు త్వరలోనే ఆపరేషన్ ఆలౌట్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇక హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ బోడో తీవ్రవాదులతో చర్చల ప్రసక్తే లేదని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. దీంతో భారత సైన్యం కూడా బోడో తీవ్రవాదులపై ఉక్కుపాదం మోపనుంది. సైన్యం 'ఆపరేషన్ ఆలౌట్' పేరిట చేపట్టనున్న ఏరివేత త్వరలో ప్రారంభం కానుందని అన్నారు.
బోడో తీవ్రవాదుల ఏరివేతకు బలగాలను సిద్ధం చేశామని ప్రకటించారు. బోడో తీవ్రవాదుల ఏరివేతకు మయన్మార్, భూటన్ల సహకారం తీసుకుంటామని, 50 కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దించామని చెప్పారు. అస్సాంలోని సోనిట్పూర్. కోక్రాఝర్ జిల్లాల్లో ఎన్టీఎఫ్బీ(ఎస్) తీవ్రవాదుల మారణకాండలో మృతుల సంఖ్య 79కి చేరింది.
అస్సాంలో బోడో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాద్ సింగ్ గురువారం ఉదయం సోనిట్పూర్ జిల్లాలో పర్యటిస్తూ పరిస్ధితిని సమీక్షించారు. బుధవారం రాత్రే అస్సాంకు చేరుకున్న హోం మంత్రి బోడో తీవ్రవాదుల చర్యను హింసాత్మక చర్యగా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్తో కలిసి గురువారం ఉదయం బాధిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి రాజకీయనేతలతోనూ, స్వచ్చంద, సామాజిక సంస్ధలవారితోనూ ఆయన చర్చలు జరిపారు. బిశ్వనాథ్ చరియాలిలోని సర్కూట్ హౌస్లో ఆయన ఆదివాసి ప్రతినిధులతో చర్చలు జరిపారు.