పీఓకెపై యాక్షన్కి సిద్దం.. ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ కీలక వ్యాఖ్యలు
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(POK)పై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకె భారత్కే చెందాలని పార్లమెంట్ భావిస్తే.. దానికి అనుగుణంగా ఆర్మీ యాక్షన్ ఉంటుందని వ్యాఖ్యానించారు. పైనుంచి ఆదేశాలు వస్తే చర్యలు తీసుకోవడానికి సిద్దమని తెలిపారు. జమ్మూకశ్మీర్ భారత అంతర్భాగమని పార్లమెంట్ తీర్మానం చేసిందని.. ఒకవేళ పీఓకె కూడా మనకే చెందాలని భారత్ భావిస్తే.. దానిపై పార్లమెంట్లో తీర్మానం చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ తీర్మానంపై తమకు ఆదేశాలు అందితే పీఓకెపై చర్యలకు సిద్దమవుతామని చెప్పారు. నెలవారీ ప్రెస్మీట్లో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరవణే మాట్లాడారు.
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పీఓకెను కూడా స్వాధీనం చేసుకోవాలని పలువురు కేంద్రమంత్రులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ పీఓకె భారత అంతర్భాగమని గతేడాది సెప్టెంబర్లో వ్యాఖ్యానించారు. అంతేకాదు,ఏదో ఒకరోజు దానిపై భౌతిక చర్యకు దిగుతామని చెప్పారు.
#WATCH Army Chief on if PoK can be part of India as stated by political leadership: There is a parliamentary resolution that entire J&K is part of India.If Parliament wants it,then,PoK also should belong to us. When we get orders to that effect, we'll take appropriate action pic.twitter.com/P8Rbfwpr2x
— ANI (@ANI) January 11, 2020
ఇక జమ్మూకశ్మీర్ గురించి ప్రస్తావిస్తూ.. ప్రతీరోజూ ఇంటలిజెన్స్ రిపోర్టులు అందుతున్నాయని.. ఆ మేరకు ఎల్ఓసీ వద్ద అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నామని చెప్పారు. చొరబాట్లను అడ్డుకోవడం భారత సైన్యం ముందున్న తక్షణ,తాత్కాలిక ప్రాధాన్యత అని.. సాంప్రదాయ యుద్దం అనేది దీర్ఘకాలిక ప్రాధాన్యత అని చెప్పారు.
ఇక త్వరలోనే డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్కు, చైనా వెస్ట్రన్ కమాండ్కు మధ్య హాట్లైన్ ఏర్పాటు జరుగుతుందన్నారు.త్రివిధ దళాలకు తొలిసారిగా చీఫ్ను నియమించడంపై నవరణే స్పందించారు. ఇది మంచి పరిణామం అని.. ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు సమన్వయంతో పనిచేసేందుకు దోహదపడుతుందని అన్నారు. భవిష్యత్లో ఎదుర్కొబోయే యుద్ధాల కోసం కేంద్రీకృత నెట్వర్క్తో పాటు కఠినమైన శిక్షణపై దృష్టిసారించినట్టుగా చెప్పారు.